చైనాను కుదిపేసిన భూకంపం, 381 మంది మృతి
బీజింగ్: చైనాను భారీ భూకంపం కుదిపేసింది. 381 మందిని సమాధి చేసింది. దాదాపు 1,891 గాయపడ్డారు. నైరుతి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్లో రిక్టర్స్కేలుపై 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలగజేసి, బీభత్సం సృష్టించింది.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి రవాణ, విద్యుత్, టెలీసమాచార వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. లాంగ్టౌషన్ పట్టణంలో 12 కిలోమీటర్లు, లుడియాన్, ఝావోటాంగ్ నగరంలో 23 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది.
దీని ప్రభావం లుదియాన్ నగరంపైనే తీవ్రంగా ఉంది. కేవలం ఆ ఒక్క నగరంలోనే 120 మంది చనిపోయారు. గల్లంతైన 181 మందిలో 180 మంది ఆ నగరానికి చెందిన వారే. అంతేగాక గాయపడిన వారిలోనూ 1300 మంది నగర పౌరులే.
రోడ్లు తెగిపోయాయి. దీంతో సహాయక బృందాలు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 2,500 బలగాలు భుకంపం తాకిడి ప్రాంతానికి వెళ్లాయి. చైనా రెడ్ క్రాస్ సొసైటీ కిట్స్, జాకెట్స్, టెంట్లు సరఫరా చేసింది. యున్నం ప్రాంతంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.