సడన్ అవుట్ బ్రేక్: చైనాలో మళ్లీ కరోనా విజృంభణ: 3 నెలల తరువాత: పెను ప్రమాదం తప్పదంటూ వార్నింగ్
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోన్న భయానక కరోనా వైరస్కు జన్మనిచ్చినట్లుగా అనుమానిస్తోన్న చైనాలో మరోసారి భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని చైనా జాతీయ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఏప్రిల్ తరువాత ఇదే తొలిసారి.
Recommended Video
కరోనా ఉత్పాతం: రోజురోజుకూ అధ్వాన్నంగా: 14 లక్షలను దాటి: ఊహించని వేగం: దారుణ స్థితికి
వుహాన్తో ఆరంభం..
చైనా హ్యూబే ప్రావిన్స్లోని వుహాన్ సిటీలో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రమంగా ప్రపంచం మొత్తాన్నీ కమ్మేశాయి. ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఆరున్నర లక్షల మందిని ఇప్పటిదాకా కరోనా వైరస్ బలి తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి, మరణాల సంఖ్యా ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ కరోనా వైరస్కు బ్రేకులు పడే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిణామాల మధ్య మరోసారి చైనాలోనే కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది.
కొత్తగా 61 కరోనా కేసులు..
చైనా జాతీయ కమిషన్ అధికారులు తాజా ప్రకటన ప్రకారం.. కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం సుమారు మూడు నెలల తరువాత ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోందని కమిషన్ అధికారులు చెబుతున్నారు. చైనాలో ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ఈ సంఖ్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కరోనాను నియంత్రించినట్లుగా భావిస్తూ.. సాధారణ జనజీవనాన్ని గడుపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళనకరమేనని అంటున్నారు.
కొత్త ప్రాంతాలకు విస్తరణ..
చైనా ఆగ్నేయ ప్రాంతంలోని గ్ఝిన్జియాంగ్ రీజియన్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ రీజియన్ రాజధాని ఉరుంక్వీలో స్థానికంగా 57 కేసులు నమోదు అయ్యాయి. మరో నాలుగు కేసులు పొరుగు దేశాల నుంచి వచ్చిన వారి వల్ల వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిరోజుల కిందటే లియాయోనింగ్ ప్రావిన్స్లోని దలియాన్ సిటీలో 14 కేసులు నమోదు అయ్యాయి. ఉత్తర కొరియాతో సరిహద్దులను పంచుకుంటోన్న జిలిన్ ప్రావిన్స్లో కేసులు నమోదు అయ్యాయి. అవే అత్యధికంగా కేసులుగా ఇప్పటిదాకా కొనసాగాయి. ఏప్రిల్ 14వ తేదీన చైనాలో అత్యధికంగా ఒక్కరోజులో 89 కేసులు రికార్డు అయ్యాయి.
మళ్లీ లాక్డౌన్ దిశగా..
అదే సమయంలో కొత్తగా గ్ఝిన్జియాంగ్ రీజియన్లో ఒకేసారి 61 కేసులు నమోదు కావడం పట్ల చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికారుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ మొదటికి వస్తుందేమోననే భయాందోళనలు అధికారుల్లో నెలకొంది. మరోసారి లాక్డౌన్ విధించే దిశగా చర్యలను తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టినట్టు భావించామని, అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటూనే ఉన్నామని హెల్త్ కమిషన్ అధికారులు చెప్పారు.