800ఏళ్ల, 1000 చేతుల బుద్ధవిగ్రహానికి పునరుద్ధరణ
బీజింగ్: చైనా నైరుతీ ప్రావిన్స్లో వెయ్యి చేతులతో ప్రసిద్ధి చెందిన 800 ఏళ్ల నాటి బుద్ధ విగ్రహానికి పూర్వ వైభవం తీసుకు వచ్చారు. చైనాలో 800 ఏళ్ల క్రితం సంగ్ వంశస్థుల పాలనలో ఈ విగ్రహాన్ని చెక్కినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
దీనికి తాజాగా నిపుణులు పూర్వ వైభవం తెచ్చారు. 25 అడుగుల ఎత్తు, 41 అడుగుల వెడల్పు, వెయ్యి చేతులతో అత్యంత అద్భుతంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
కాలక్రమేణా అది కాంతివిహీనమై పోయింది. అక్కడక్కడా ధ్వంసమైంది. ఈ చారిత్రక సంపద పరిరక్షణకు 2008లో ప్రభుత్వం పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ఇవీ ఇటీవలే పూర్తయ్యాయి. దీని పునరుద్ధరణకు రూ.63 కోట్లు ఖర్చయింది. ఇది సిచువాన్ రాష్ట్రంలో ఉంది. దీనిని చైనీయులు కియాన్షు గ్వాన్యిన్ అని పిలుస్తారు.
పది లక్ష బంగారు రేకులను ఉపయోగించి 830 చేతులను నిపుణులు నవీకరించారు. ఈ పనులతో విగ్రహం మరో 50 ఏళ్ల వరకూ వెలుగులు జిమ్ముతుందని అంచనా వేశారు. ఏళ్లుగా విగ్రహం రంగు మసకబారడం, కొన్ని బంగారు రేకులు ఊడిపోవడం, పగుళ్లు కనిపించడం లాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో దీనిని పునరుద్ధరించారు.