దలైలామాను కలిస్తే అంగీకరించం: అమెరికాను హెచ్చరించిన చైనా
బీజింగ్: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఎవరు కలిసినా, దేని కోసం కలిసినా అంగీకరించేది లేదని చైనా సోమవారం నాడు అమెరికాను హెచ్చరించింది. ఫిబ్రవరి ఐదో తేదీన వాషింగ్టన్లో మత సంబంధమైన స్వేచ్ఛ పైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగిస్తారు.
దీనికి దలైలామా హాజరు కానున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా యూఎస్ను హెచ్చరించింది. దలైలామా ఒక వేర్పాటువాది అని, అతనిని ఎవరైనా కలవాలనుకుంటే తమ దేశానికి సంబంధించిన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని చెప్పింది.
ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ ప్రకటించారు. టిబెట్ విషయంలో అమెరికా తమకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోదని ఆశిస్తున్నామన్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలగకుండా ఒబామా నడుచుకుంటారని భావిస్తున్నామన్నారు.
చైనా వ్యాఖ్యల పైన శ్వేతసౌధం స్పందించింది. దలైలామా - ఒబామాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, కానీ వారిద్దరు కలిసి చర్చల్లో పాల్గొంటున్నట్లు అధికారికంగా ప్రకటించలేదని తెలిపింది.
ఉగ్రవాదులను కోర్టుకి ఈడ్చాల్సిందే
అంతర్జాతీయ ఉగ్రవాదం విసురుతున్న కొత్త సవాళ్లపై భారత్, రష్యా, చైనా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచస్థాయిలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న శక్తులకు, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని ఈ మూడు దేశాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి.
సోమవారం బీజింగ్లో జరిగిన 13వ రష్యా-భారత్-చైనా సమావేశంలో మూడు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు చర్చలు జరిపారు. ఉగ్రవాదులను అణచివేసేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. రష్యా-భారత్-చైనా(ఆర్ఐసీ) సమావేశంలో ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు ఉగ్రవాదంపై ప్రకటన చేశారు.