అమెరికాకు చెనా భారీ షాక్- ఏకంగా 125 శాతానికి సుంకాల పెంపు...!
విదేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారీ షాకిచ్చారు. గతంలో అమెరికా వస్తువులపై సుంకాల్ని 84 శాతానికి పెంచేసిన చైనా.. ఇప్పుడు దాన్ని ఏకంగా 125 శాతానికి పెంచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా వస్తువులపై 145 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కౌంటర్ గా చైనా ఈ నిర్ణయం ప్రకటించింది.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచీ విదేశాలపై ప్రతీకాల పన్నులు విధిస్తున్న ట్రంప్.. తాజాగా చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన సుంకాల అమలును వాయిదా వేశారు. చైనాపై మాత్రం 125 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఏకంగా 145 శాతానికి సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో చైనాకు మంటపుట్టింది. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్దాన్ని దీటుగా ఎదుర్కోవాలని చైనా నిర్ణయించింది.

ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్ ను సైతం కలిసి రావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కోరారు. అదే సమయంలో అమెరికా ఉత్పత్తులపై సుంకాల్ని 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే తమ నిర్ణయం తర్వాత ఇక అమెరికా వస్తువులపై సుంకాల పెంపు ఉండబోదని, ఎందుకంటే ఇంత సుంకాల భారం మోసేందుకు మార్కెట్ సిద్ధంగా లేదని, దాని బదులు ఆయా వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం మానేస్తామని వెల్లడించింది.
మరోవైపు ట్రంప్ పిచ్చి నిర్ణయాలపై అమెరికా ప్రజల్లో ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 5న దేశవ్యాప్తంగా 1200 ప్రాంతాల్లో ఒకేసారి నిరసనలకు దిగిన ప్రజలు.. ఏప్రిల్ 19న మరోసారి ఇంతకు మించిన నిరసనలకు పిలుపునిస్తున్నారు. ట్రంప్ ఆర్ధిక వ్యవస్ధను నాశనం చేస్తున్నారని, వాణిజ్య యుద్దంతో అమెరికాకు ఒరిగేదేమీ లేదని వారు ఆరోపిస్తున్నారు. అలాగే ఉద్యోగాల్లో కోత పెట్టడం వంటి నిర్ణయాల్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న అమెరికా వ్యాప్తంగా మరోసారి జరిగే ఆందోళనలు ట్రంప్ ను కదిలిస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications