సిక్కిం స్వాతంత్య్రానికి మద్దతిస్తాం: చైనా మీడియా బరితెగింపు
న్యూఢిల్లీ/బీజింగ్: చైనా మీడియా భారత్ను బెదిరింపులకు గురిచేస్తూ బరితెగింపు కథనాలను ప్రచురితం చేస్తోంది. సిక్కిం సరిహద్దు వివాదం నేపథ్యంలో తాజాగా 'సిక్కిం ప్రజలకు భారత్ నుంచి విముక్తి కలిగి వారు స్వాతంత్య్రం పొందాలి' అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది.
బెదిరింపులు
డోక్లాంలో నెలకొన్న ప్రతిష్టంభనపై గత కొన్ని రోజులుగా చైనా.. భారత్ను హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత భారత్పైనే ఉందని, ఆ దేశ బలగాలు వెనక్కి వెళ్లకపోతే పరిస్థితి యుద్ధానికి దారితీస్తుందని బెదిరింపులకు పాల్పడుతోంది.
సిక్కింకు మద్దతంటూ..
ఇప్పుడేమో సిక్కిం ప్రజలను రెచ్చగొట్టే యత్నాలను ముమ్మరం చేస్తోంది. ‘సిక్కింను భారత్ ఆక్రమించుకున్నప్పటికీ ఆ రాష్ట్రం గురించి చైనా ఆలోచిస్తోంది. సిక్కింలోని ప్రజలు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారు. వారికి ఈ దేశం తప్పకుండా మద్దతిస్తుంది' అని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొనడం గమనార్హం.
ఉద్యమాలంటూ రెచ్చగొడుతోంది..
అంతేగాక, ‘కొన్ని పరిస్థితుల్లో భూటాన్, సిక్కింలలో భారత వ్యతిరేక ఉద్యమాలు జరిగే అవకాశాలున్నాయి. అవి కచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇప్పటికే భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఉద్యమాలు జరిగేదక్షిణ హిమాలయాల ప్రాంతీయ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి' అని గ్లోబల్ టైమ్స్ కథనంలో రాసుకొచ్చింది.
భారీగా బలగాలు..
కాగా, ఇప్పటికే డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా బలగాలు భారీగా మోహరించాయి. భారత బలగాలు వెనక్కి వెళ్లితే మంచిదని, లేదంటే తామే వెళ్లడతామని చైనా మీడియా ఇప్పటికే కథనాలు ప్రచురితం చేసింది. భారత్ ఇలాగే వ్యవహరిస్తే యుద్ధం తప్పదని హెచ్చరిస్తూ వస్తోంది. అసలు తమది కానీ ప్రాంతంలో బలగాలను మోహరించడమే గాక, బెదిరింపులకు పాల్పడటంపై భారత్.. చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, టిబెట్ తోపాటు పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా సామ్రాజ్యవాదానికి అంతేలేకుండా పోతోందని విశ్లేషకులు అంటున్నారు.