పులి మాంసంతో స్నేహితులకు విందు: వ్యాపారవేత్తకు 13ఏళ్ల జైలు శిక్ష
బీజింగ్: పులుల మాంసంతో విందులు, వినోదాలు నిర్వహించిన ఓ వ్యాపారవేత్తకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. చైనాలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జూ (ఇంటిపేరుతో మాత్రమే వెల్లడించారు) అనే వ్యక్తి నిరుడు వేటగాళ్ల నుంచి మూడు చనిపోయిన పులులను కొనుగోలు చేశాడు.
అంతేగాక, పులిమాంసంతో వంటకాలను చేయించి స్నేహితులకు విందుభోజనాలు ఏర్పాటు చేశాడు. గ్వాంగ్జీ ప్రావిన్స్ రాజధాని నాన్నింగ్లోని తన హోటల్కు పులి మాంసాన్ని ముక్కలుగా చేసి తరలించాలని జూ 14 మందికి ఆదేశాలు ఇచ్చినట్టు విచారణలో వెల్లడైందని క్వింఝౌ నగర కోర్టు పేర్కొంది.

గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో విద్యుత్ షాక్తో చంపిన పులి కళేబరాన్ని నిరుడు మార్చి 13న హోటల్కు తెప్పించుకొని.. దాని మాంసం, ఎముకలు, నెత్తురుతో వండిన వంటలతో జూ తన స్నేహితులకు విందు ఇచ్చాడని దర్యాప్తు అధికారులు తేల్చారు.
నిరుడు ఏప్రిల్ 21, మే 20వ తేదీల్లో కూడా రెండు పులుల మాంసంతో విందు ఇచ్చాడని కోర్టుకు నివేదించారు. 70,957 డాలర్లు (సుమారు రూ. 45 లక్షలు) చెల్లించి ఒక్కో చనిపోయిన పులిని కొనుగోలు చేసినట్టు నిందితుడు కోర్టు ముందు అంగీకరించాడు.
విందుకు సంబంధించిన వీడియోను గుర్తించిన పోలీసులు, అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, కోర్టు అతనికి సోమవారం 13ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడు పులులను చంపిన 14మందికి ఐదు నుంచి ఆరేళ్ల జైలు శిక్ష పడనుంది.












Click it and Unblock the Notifications