స్తంభించిన అమెరికా: వందల సంఖ్యలో విమానాలు రద్దు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పౌర విమానయానం మొత్తం స్తంభించిపోయింది. గాల్లో ఎగురుతున్న విమానాలన్నీ ఎక్కడికక్కడే గ్రౌండ్ అయ్యాయి. సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులల్లో ల్యాండ్ అయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడ్డారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తడమే దీనికి కారణమని తేలింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 6:45 నిమిషాలకు ఏవియేషన్ అడ్మిన్లో కంప్యూటర్ అవుటేజ్ సంభవించింది. ఫలితంగా- విమానాలతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అనుసంధానాన్ని కోల్పోయారు.
ఈ ఉదయం 7 గంటల వరకు అమెరికా వ్యాప్తంగా 1,200 విమాన సర్వీసులు సకాలంలో టేకాఫ్ తీసుకోలేకపోయాయి. షెడ్యూల్ ప్రకారం.. 93 విమానాలను అధికారులు రద్దు చేశారు. ప్రత్యేకించి- యూఎస్ ఈస్ట్ కోస్ట్ రీజియన్లో దాదాపు అన్ని విమాన సర్వీసులు ఈ కంప్యూటర్ అవుటేజ్ వల్ల తీవ్ర ప్రభావితం అయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ అనే వెబ్సైట్ తెలిపింది.
కంప్యూటర్లు స్తంభించిపోవడం వల్ల నోటీస్ టు ఎయిర్ మిషన్ సిస్టమ్స్ (నోటాం)ను జారీ చేయలేకపోయామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరించింది. కంప్యూటర్లు, సర్వర్లల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను యుద్ధప్రాతిపదికన సరి చేస్తోన్నామని పేర్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.
కాగా- అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, అమెరికన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానాలు నేలకు దిగాయి. సమీప విమానాశ్రయాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. దాదాపుగా 90 శాతం పౌర, కార్గో విమానాలు ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ పేర్కొంది.
వందల సంఖ్యలో విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడటం, పలు సర్వీసులు రద్దు కావడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానాశ్రయాల్లో పడిగాపులు పడ్డారు. మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై సరైన సమాచారం ఎవరి వద్దా లేకపోవడంతో వారిని మరింత అయోమయానికి గురి చేసింది.
వైఎస్ జగన్కు థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..!!