కొనసాగుతున్న అరాచకం: బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణ హత్య
బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్య ఘటనలను మరువకముందే మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. మయమన్సింగ్ జిల్లాలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న బజేంద్ర బిస్వాస్ (42)ను తనతో పాటే పనిచేసే నోమాన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
సోమవారం (డిసెంబర్ 29) సాయంత్రం సుమారు 6:45 గంటలకు మెహ్రాబారి ప్రాంతంలోని 'సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్' ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. బజేంద్ర బిస్వాస్, నిందితుడు నోమాన్ మియా (29) ఇద్దరూ ఫ్యాక్టరీ ప్రాంగణంలోని అన్సార్ బ్యారక్లో డ్యూటీలో ఉన్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో, నోమాన్ తన వద్ద ఉన్న ప్రభుత్వ షాట్గన్ను బజేంద్ర వైపు గురిపెట్టాడు. అది తమాషా మాత్రమేనని చెబుతూనే కాల్పులు జరిపాడు.

తమాషా వెనుక కుట్ర కోణం ఉందా?
తుపాకీ గుండు బజేంద్ర బిస్వాస్ ఎడమ తొడలోకి బలంగా దూసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడు దీనిని కేవలం తమాషా అని కొట్టిపారేసినప్పటికీ.. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దీని వెనుక ఏదైనా లోతైన కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు బజేంద్ర బిస్వాస్ తన కుటుంబానికి ఏకైక ఆధారమని స్థానికులు చెబుతున్నారు.
వణికిపోతున్న హిందువులు
ఈ ప్రాంతంలో హిందువులపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. కేవలం 11 రోజుల క్రితం, ఇదే ప్రాంతంలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా కొట్టి, వివస్త్రను చేసి, సజీవ దహనం చేసిన ఉదంతం కలకలం రేపింది. మానవ హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యక్తులపై దాడులు గణనీయంగా పెరిగాయి. వరుసగా జరుగుతున్న ఈ హత్యలు బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాల భద్రతపై గట్టి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కేవలం "తమాషా" పేరుతో ప్రాణాలు తీయడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications