చైనా మరో షాక్... కరోనా వైరస్ మూలాలపై కొత్త వాదన... కవర్ చేసుకునేందుకు ఆపసోపాలు
కరోనా వైరస్ అనగానే చైనా వైరస్ అనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నాటుకుపోయింది. కానీ చైనా మాత్రం ఆ అపప్రదను తొలగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా కరోనా జన్మస్థలం కాదని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ఆ దేశం... తాజాగా మరోసారి ఇదే అభిప్రాయాన్ని మరో రకంగా చెప్పే ప్రయత్నం చేసింది. గతేడాది ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందని... కానీ మొట్టమొదట దాని గురించి రిపోర్ట్ చేసి... చర్యలు తీసుకున్న ఏకైక దేశం చైనానే అని చెప్పుకొచ్చింది.

చైనా కొత్త వాదన...
కోవిడ్ 19 వుహాన్లోని బయో-ల్యాబ్ నుంచి పుట్టుకొచ్చిందన్న అమెరికా ఆరోపణలను చైనా ఖండించింది. అలాగే అదే వుహాన్లోని సముద్రపు మార్కెట్లో అలుగులు,గబ్బిలాల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకిందన్న వాదనను కూడా తోసిపుచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ దీనిపై మాట్లాడుతూ... 'కరోనా వైరస్ అనేది ఒక కొత్త రకమైన వైరస్... దీనికి సంబంధించి ఎన్నో నిజాలను రిపోర్టులు బయటపెట్టాయి. మనందరికీ తెలుసు... గతేడాది ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అయితే చైనా మాత్రమే దీనిపై మొదట రిపోర్ట్ చేసింది... వైరస్ జన్యు లక్షణాలను మిగతా ప్రపంచానికి తెలిపింది.' అని వ్యాఖ్యానించారు.

అమెరికా ఆరోపణలతో...
ఇటీవల జపాన్లోని టోక్యో వేదికగా జరిగిన క్వాడ్ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కరోనా వ్యాప్తికి చైనానే కారణమని ఆరోపించిన నేపథ్యంలో చైనా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. చైనా నిజాలు దాచిపెట్టడం వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి దాపురించిందని మైక్ పాంపియో ఆరోపించారు. నిజానికి చైనీస్ పౌరులు కరోనా వైరస్పై మొదటి నుంచి గొంతెత్తుతున్న అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం బలవంతంగా వాళ్ల నోళ్లు మూయించిందన్నారు.

చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం...!!
మరోవైపు వైరస్ మూలాలను కనిపెట్టేందుకు సిద్దమైన డబ్ల్యూహెచ్ఓ... నిపుణుల బృందాన్ని బీజింగ్ పంపించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిపుణుల జాబితాను చైనాకు అందించింది. చైనా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ బృందం అక్కడికి వెళ్లి వైరస్ మూలాలపై పరిశోధనలు జరిపనుంది. హాంకాంగ్కి చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ఈ వివరాలను వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓకి చెందిన ఇద్దరు సభ్యుల బృందం అగస్టులో వుహాన్ను సందర్శించి... వైరస్ మూలాలను శోధించేందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ను పూర్తి చేసింది.

36మిలియన్లకు పైగా కేసులు...
జాన్ హోప్కిన్స్ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ వివరాల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 36మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకూ 1మిలియన్ మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో అత్యధికంగా ఒక్క అమెరికాలోనే 7.6మిలియన్ల కేసులు నమోదవగా... 2,12,000 పైచిలుకు మంది వైరస్ కాటుకు బలయ్యారు. ఇక వైరస్ పుట్టుకొచ్చిన చైనాలో 90,736 పాజిటివ్ కేసులు నమోదవగా... ఇప్పటివరకూ 4739 మంది మృత్యువాతపడ్డారు.












Click it and Unblock the Notifications