విమాన ప్రయాణంలో మహిళకు కరోనా పాజిటివ్: బాత్రూంలోనే ఐసోలేషన్!
న్యూయార్క్: అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. విమానప్రయాణంలో ఉండగానే ఓ ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రయాణం మధ్యలో పాజిటివ్ గా తేలడంతో విమానంలోని బాత్రూంలోనే కొన్ని గంటలపాటు ఐసోలేషన్లో ఉంచారు. డిసెంబర్ 19న అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మిషిగాన్ కు చెందిన మరీసా ఫోటియా అనే ఉపాధ్యాయురాలు చికాగో నుంచి ఐస్లాండ్కు ప్రయాణమయ్యారు. విమాన ప్రయాణం ప్రారంభమైన కొద్ది సమయానికే ఆ మహిళకు గొంతులో నొప్పి రావడం మొదలైంది. దీంతో ఆందోళన చెందిన మహిళ.. అక్కడు అందుబాటులో ఉన్న ర్యాపిడ్ టెస్ట్ చేసుకు్నారు. ఈ టెస్టులో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. అయితే, ప్రయాణానికి ముందు రెండుసార్లు పీసీఆర్ పరీక్షలు, ఐదుసార్లు ర్యాపిడ్ టెస్టులు జరిపించుకోగా వాటన్నింటిలోనూ నెగెటివ్ వచ్చిందని ఆమె తెలిపింది.
కానీ, విమానం ఎక్కి ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటలకే గొంతునొప్పిగా అనిపించిందని, దీంతో కోవిడ్ టెస్టు చేయించుకున్నానని సదరు మహిళ తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలడంతో భయాందోళనకు గురైనట్లు బాధితురాలు ఫొటియా ఓ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో ఏడ్చుకుంటూ విమాన సిబ్బందికి తెలియజేశానని, ఆ సమయంలో అంతకుముందు తనతో కలిసి భోజనం చేసిన తన కుటుంబసభ్యులు, విమానంలోని తోటి ప్రయాణికుల గురించి తీవ్ర ఆందోళన చెందానంటూ తెలిపింది.
విమాన సిబ్బందికి తెలియజేయడంతో మరో సీటు చూశారు కానీ, అన్ని నిండుగా ఉండటంతో ఆమెను బాత్రూంలోనే ఐసోలేషన్లో ఉంచారు. వెంటనే బయట నుంచి ఔట్ ఆఫ్ సర్వీస్ అనే స్టిక్కర్ అంటించారు ఆ తర్వాత ఐస్ ల్యాండ్ లో విమానం దిగగానే ఫాటియాతోపాటు ఆమె కుటుంబసభ్యులను మాత్రం చివర్లో పంపించారు. విమానాశ్రయంలో జరిపిన ర్యాపిడ్, పీసీఆర్ టెస్టుల్లోనూ ఆమెకు పాజిటివ్ గా వచ్చిందని విమాన సిబ్బంది తెలిపారు. కాగా, బాధితురాలు రెండు మోతాదులతోపాటు బూస్టర్ డోసు కూడా తీసుకుంది.