చైనాకు.. సోవియట్ గతే! విశృంఖలంగా అవినీతి, ఏదో ఒకరోజు కుప్పకూలడం ఖాయం!?
కమ్యూనిస్ట్ దేశం చైనాలో అవినీతి రాజ్యమేలుతోందా? అది కూడా దేశాన్ని పతనం చేసే స్థాయికి పెరిగిందా? సోవియట్ యూనియన్లా చైనా కూడా ఏదో ఒకరోజు కుప్పకూలిపోనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వస్తున్నాయి.
బీజింగ్: కమ్యూనిస్ట్ దేశం చైనాలో అవినీతి రాజ్యమేలుతోందా? అది కూడా దేశాన్ని పతనం చేసే స్థాయికి పెరిగిందా? సోవియట్ యూనియన్లా చైనా కూడా ఏదో ఒకరోజు కుప్పకూలిపోనుందా?
ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఈ పరిణామాలను చైనా ఉన్నతాధికారులే బలపరుస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 25 పొలిట్ బ్యూరోలో కీలక నేతగా ఎదిగిన యాంగ్ క్సియాడు అవినీతిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.
సోవియట్ యూనియన్ తర్వాత...
కమ్యూనిస్ట్ ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి.. చైనా. సోవియట్ యూనియన్ తరువాత అంతటి స్థాయికి ఎదిగిన దేశమిది. అయితే అవినీతి భూతం చైనా అర్థిక పునాదులను కూలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చైనా బయటి దేశాలతో చేసే యుద్ధం కన్నా.. ముందు దేశంలో విశృంఖలంగా పెరిగిపోయిన అవినీతిపై యుద్ధం చేయాలని.. లేకపోతే సోవియట్ యూనియన్ తరహాలో.. చైనా కూడా అత్యంత వేగంగా విచ్ఛిన్నమవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు.
గత ప్రభుత్వాలే కారణం...
చైనాలో అవినీతి భూతాన్ని గత ప్రభుత్వాలే ప్రోత్సహించాయని, క్రమంగా అవినీతిపరులు పార్టీని శాసించే స్థాయికి చేరుకున్నారని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని చైనా కమ్యూనిస్ట్ పార్టీ 25 పొలిట్ బ్యూరో కీలక నేత యాంగ్ క్సియాడు చెబుతున్నారు. అవినీతి పరులు బలోపేతం కావడంతో చివరికి పార్టీ బలహీన పడే స్థాయికి చేరిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విచ్చిన్నం దిశగా దేశం...
దేశంలో విశృంఖలంగా పెరిగిన అవినీతిని కట్టడి చేయాలని యాంగ్ క్సియాడు.. ఏకంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నే కోరారు. అవినీతిని కట్టడి చేయలేకపోతే.. చైనా మరో సోవియట్ యూనియన్ అవుతుందని కూడా యాంగ్ హెచ్చరించడం గమనార్హం.
తీవ్ర పరిణామాలు తప్పవు...
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ఇతర కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే పార్టీలో పట్టు కోల్పోతున్నారని కూడా యాంగ్ ప్రకటించారు. పార్టీపై కీలక నేతలు పట్టుకోల్పోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాంగ్ పేర్కొన్నారు.
జీ జిన్పింగ్ కుడిభుజం కూడా...
అధ్యక్షుడు జీ జిన్పింగ్ కుడిభుజం, అధికార పార్టీలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ అయిన వాంగ్ క్వుషాన్, తాజాగా యాంటి కరప్షన్ చీఫ్ జాహో లెజీ కూడా చైనా ప్రమాదకర స్థితిలో ఉందని చెబుతున్నారు. భారీగా పెరిగిన అవినీతి వల్ల చైనా ఎప్పుడైనా కూలిపోవచ్చనే సందేహాలు వారు కూడా వ్యక్తం చేశారు.