వియత్నాం యుద్ధాన్ని మించిన విధ్వంసం: రికార్డులు బద్దలు: మిగిలింది వరల్డ్ వార్-2, సివిల్ వార్ మాత్రమే
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసాన్ని మిగిల్చుతోంది. ఒక వైరస్ బారిన పడి ఇంత భారీగా ప్రాణనష్టాన్ని చవి చూడాల్సి రావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆ దేశంలో వేల సంఖ్యలో సైన్యం, సాధారణ పౌరులు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఆధునిక అమెరికాలో ఇంతటి విలయాన్ని సృష్టిస్తుందనే విషయాన్ని ముందుగా పసిగట్టలేకపోయారు.

వియత్నాం యుద్ధాన్ని మించిన ప్రాణనష్టం..
అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి ఎన్నో కష్ట, నష్టాలను చవి చూసింది. ఆటుపోట్లను ఎదుర్కొంది. క్రమంగా అన్ని రంగాల్లోనూ తిరుగులేని దేశంగా ఆవిర్భవించింది. అమెరికా చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఘట్టం వియత్నాంతో యుద్ధం. 1964-1975 మధ్యకాలంలో చోటు చేసుకున్న ఈ యుద్ధంలో అమెరికాలో 58,220 మంది ప్రాణాలను కోల్పోయారు. లెక్క పెట్టలేనంత ఆస్తినష్టం సంభవించింది. తాజాగా కరోనా వైరస్ వల్ల వియత్నాం యుద్ధ సమయంలో కంటే అధిక సంఖ్యలో ప్రాణనష్టాన్ని చవి చూస్తోంది.

వియత్నాం యుద్ధాన్ని మించి
తాజాగా ఈ అంకెలను దాటుకున్నాయి అమెరికాలో కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాలు. 59,226 మంది అమెరికన్లు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. వియత్నాం యుద్ధం సమయంలో సంభవించిన మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువ. దశాబ్ద కాలం పాటు వియత్నాంతో యుద్ధాన్ని కొనసాగించింది అమెరికా. మొత్తం 11 సంవత్సరాల కాలంలో అమెరికా 58,220 మందిని కోల్పోవాల్సి వస్తే.. కరోనా కాటుకు మూడు నెలల వ్యవధిలోనే దాన్ని మించి.. మృతుల సంఖ్యను లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితిలో పడింది. మొత్తంగా అమెరికాలో 59.226 మంది మరణించగా.. 10 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇక మిగిలినవి ఆ రెండే..
అమెరికా చరిత్రలో అత్యధికంగా ప్రాణనష్టాలను చవి చూసిన సంఘటనల జాబితాలో తాజాగా కరోనా వైరస్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇక మిగిలినవి రెండు రికార్డులే. రెండో ప్రపంచ యుద్ధం, సివిల్ వార్. 1941-1945 మధ్య కాలంలో సంభవించిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో 2,91,557 మంద మరణించారు. వారిలో అత్యధికులు సైనికులే. పెద్ద ఎత్తున ప్రాణ నష్టాలన్ని చవి చూసిన దేశాల్లో అమెరికా ఒకటి.

సివిల్ వార్లో అయిదు లక్షల మంది
ఇక సివల్ వార్.. 1861-65 మధ్యకాలంలో చోటు చేసుకున్న సివిల్ వార్ సందర్భంగా అమెరికాలో 4,98,332 మంది చనిపోయారు. ఈ రెండింటి స్థాయిని కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలు చేరుకుంటాయా? లేదా? అనేది తేలాల్సి ఉంది. అమెరికాలో కరోనా వైరస్ వల్ల మరణిస్తోన్న వారి సంఖ్యలో చోటు చేసుకుంటోన్న వేగాన్ని బట్టి చూస్తే ఏదైనా సాధ్యం కావచ్చని చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన నష్టం ఆధునిక అమెరికా ముందు సాక్షాత్కరించే అవకాశాలను కొట్టి పారేయడానికి వీల్లేదని అంటున్నారు.
Recommended Video

ఫిబ్రవరి 5న తొలి మరణం..
కరోనా వైరస్ వల్ల ఫిబ్రవరి 5వ తేదీన అమెరికాలో తొలి మరణం సంభవించింది. కాలిఫోర్నియాలో ఈ తొలి మరణం నమోదైంది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కంట్రీలో 57 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ కరోనా కాటుకు బలి అయ్యారు. ఆమె మృతితో ఆరంభమైన కరోనా విలయ తాండవం మూడు నెలల వ్యవధిలోనే 60 వేలకు చేరుకుంటోందంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications