కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ట్రంప్పై గవర్నర్ల తిరుగుబాటు.. చావు తప్పదన్న సీఐఏ..
గడిచిన వారంతో మహమ్మారి ముప్పు తప్పిపోతందని అందరూ ఆశించారు.. కానీ సోమవారం ఒక్కరోజే 1509 మందిని కరోనా బలి తీసుకోవడంతో మళ్లీ అలర్ట్ అయ్యారు.. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 6లక్షలకు చేరింది. ఇప్పటికే సుమారు 24వేల మంది చనిపోగా, మరో 13వేల మంది క్రిటికల్ కండిషన్ లో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వైరస్ ప్రభావం ఇంకా తగ్గకముందే వ్యవస్థల రీఓపెనింగ్పై రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరింది. కరోనా నియంత్రణ చర్యల్లో ఫెడరల్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ, ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల గవర్నర్లు తిరుగుబావుటా ఎగరేశారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ''నేను చెప్పేదాకా ఎవరూ కదలడానికి వీల్లేద''ని ఫర్మానా జారీచేశారు.
పీక్ పాయింట్ దాటిందా?
అమెరికాలో తొలి కొవిడ్-19 కేసు జనవరి చివరి వారంలో నమోదైంది. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ, ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమాంతం నాలుగింతలు, ఐదింతలైంది. అమెరికా కంటే ముందు భారీ మరణాలను చవిచూసిన ఇటలీ, స్పెయిన్ అనుభవాల దృష్ట్యా.. ప్రస్తుతం కొనసాగుతున్న(ఏప్రిల్ మూడో) వారంలో వైరస్ వ్యాప్తి పీక్ దశను దాటుతుందనే అంచనాలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్లే.. శుక్రవారం(2000 మరణాలు)తో పోల్చుకుంటే సోమవారం(1509) మరణాల రేటు కొద్దిగా తగ్గింది. అదీగాక, కరోనా దెబ్బకు బాగా ఎఫెక్ట్ అయిన న్యూయార్క్ రాష్ట్రంలో పీక్ పాయింట్ ముగిసిందని స్వయంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కౌమో వెల్లడించడంతో అంచనాలు నిజమేననే నమ్మకం పెరిగింది. దీంతో..
గవర్నర్ల గూడుపుఠాని..
‘కరోనా పీక్ పాయింట్ దాటేశాం. ఇక ఎకానమీపై దృష్టి సారిస్తాం. వ్యాపార, వాణిజ్యాల్ని తిరిగి ప్రారంభిస్తాం'అని కౌమో పత్రికాముఖంగా వెల్లడించారు. కానీ ఆయన ప్రకటనను ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ప్రకారం తనకు విశేషమైన అధికారాలుంటాయని, వ్యవస్థల రీఓపెనింగ్ పై తుది నిర్ణయం తనదేనని, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలన్నీ ఫెడరల్ సర్కారుకు లోబడి ఉండాలని ట్రంప్ హెచ్చరించారు. మొదట్లో లాక్ డౌన్ అవసరమే లేదన్న ట్రంప్.. ఇప్పుడిలా యూటర్న్ తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం గవర్నర్లకు మింగుడు పడటంలేదు. దీంతో ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా గవర్లన్లు జట్టుగా ఏర్పడ్డారు.
ఈస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ దాకా..
కరోనా వల్ల తలెత్తబోయే ఆర్థిక మాంద్యం.. 1929నాటి గ్రేడ్ డిప్రెషన్ కంటే దారుణంగా ఉండబోతోందన్న ఐఎంఎఫ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టాలని పలువురు గవర్నర్లు డిసైడయ్యారు. కలిసికట్టుగా విధానాలు రూపొందించుకుందామంటూ కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన కూడా చేశారు. అటు కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇదే తరహా ఒప్పందానికి రెడీ అయి, ఫెడరల్ సర్కారుకు సవాళ్లు విసిరారు.
ఎమర్జెన్సీ ఉంటే ప్రెసిడెంట్ రాజైపోతాడా?
‘‘ముందు నుంచి చైనాను వెనుకేసుకొచ్చాడు. ఇప్పుడేమో చైనాకు ఫేవర్ చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థను విమర్శిస్తున్నాడు. వైరస్ వ్యాప్తి చెందరకుండా ముందుగా మేం లాక్ డౌన్ ప్రకటిస్తే.. వద్దని వారించాడు. ఇప్పుడేమో తాను చెప్పేదాకా కదలొద్దని శాసిస్తున్నాడు. ఏం? దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం రద్దయిపోయి, ప్రెసిడెంట్ చక్రవర్తి అయిపోతాడా? ఫర్మానాలు చేయడానికి ట్రంప్ ఏమైనా రాజా?''అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కౌమో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడీ కామెంట్లు వైరల్ అయ్యాయి.
వీపీ ఊరడింపు..
ట్రంప్ తీరును నిరసిస్తూ ఏకమవుతోన్న గవర్నర్లు ఏకంగా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు నెలకొనడంతో వైస్ ప్రెసిడెంట్ మైక్ పేన్స్ రంగంలోకి దిగారు. ‘‘రీ ఓపెనింగ్ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు, సూచనల్ని ఫెడరల్ ప్రభుత్వం స్వీకరిస్తుంది''అని ఊరడింపు మాటలు చెప్పారు. ‘వైట్ హౌస్ వర్సెస్ గవర్నర్స్' లొల్లి కొనసాగుతుండగానే, మూడు రాష్ట్రాల్లో లాయర్లు కొత్త లొల్లి మొదలుపెట్టారు. లాక్ డౌన్ ఆదేశాలు ధిక్కరించి, డిటెన్షన్ సెంటర్లపాలైన యువతను వెంటనే విడుదల చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే,
సీఐఏ వార్నింగ్..
కొవిడ్-19 వ్యాధి చికిత్సలో యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్(hcq)బాగా పనిచేస్తుందన్న రిపోర్టులు రావడంతో ఆ మందుకు గిరాకీ ఏర్పడటం, ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే 25లక్షల డోసుల hcq తెప్పించడం తెలిసిందే. అయితే నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాత్రం ఆ మందును వాడొద్దని తన ఉద్యోగులను హెచ్చరించింది. hcqని నేరుగా తీసుకుంటే చావు తప్పని పరిస్థితులు ఎదురుకావొచ్చని, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చని తెలిపింది. ఇప్పటికి అధ్యయన దశలోనే ఆ ఈ విషయం ప్రూవ్ అయిందని, కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ డాక్టర్ల సూచనమేరకు మాత్రమే దాన్ని వినియోగించాలని సీఐఏ తన ఉద్యోగులను ఆదేశించింది.
Recommended Video
అమెరికా టాప్..
అగ్రరాజ్యంలో కొవిడ్-19 కేసులు(దాదాపు6 లక్షలు), మరణాలు(సుమారు 24వేలు) రికార్డు స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20లక్షలకు పెరిగింది. 4.6లక్షల మంది రికవరీకాగా, 1.21లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత మరణాల్లో ఇటలీ(20,465), స్పెయిన్(18, 056), ఫ్రాన్స్(14,967), యూకే(12,107)ముందున్నాయి. ఇండియాలో కేసుల సంఖ్య 10500, మరణాలు 358గా ఉన్నాయి.