పాక్ యూత్ మనసు గెలిచిన సుష్మా: ఇండియన్స్కి పాక్ అమ్మాయి థ్యాంక్స్
న్యూఢిల్లీ: యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో పాకిస్తాన్ - భారత్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీసుకున్న ఓ చర్య పాకిస్థానీ యువత హృదయాన్ని గెలుచుకుంది.
సెప్టెంబర్ 27న చండీగఢ్లో జరిగిన గ్లోబల్ యూత్ పీస్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు 19 మంది యువతులు ఉన్న పాకిస్థానీ బృందం భారత్కు వచ్చింది. వారు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో భారత్ ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులు నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఈ బృందం తిరుగు ప్రయాణం చిక్కుల్లో పడింది. వెంటనే భారత అధికారులు ఈ బృందానికి అదనపు భద్రతను సమకూర్చారు.
అక్టోబర్ ఒకటో తేదీన ఈ బృందానికి చెందిన అలియా హరీర్ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. సుష్మా వారికి తిరుగు పయనంపై భరోసా ఇచ్చారు. దీంతో ఆ బృందం సురక్షితంగా తిరుగు ప్రయాణమైంది. అక్టోబర్ రెండో తేదీన అలియా హరీర్ భారత్ను పొగడ్తలతో ముంచెత్తారు.
భారతీయులు తమ అతిథులను దేవుళ్లలా చూస్తారని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నేడు ఆమె మరోసారి ట్విట్టర్లో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు థ్యాంక్స్ చెప్పారు. దీనికి కేంద్ర మంత్రి కూడా ఆడ పిల్లలు ఎవరికైనా ఆడపిల్లేగా అని స్పందించారు. తద్వారా నెటిజన్ల హృదయాలు గెలుచుకున్నారు.