దావూద్ ఇబ్రహీం ఏం చేశాడో తెలుసా?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యతో తన బంధాన్ని కొనసాగిస్తూనే.. పాకిస్థానీ పఠాన్ మహిళను వివాహమాడినట్లు దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలిషా పార్కర్ వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎదుట అతడు ఈ విషయాలను వెల్లడించినట్లు ఒక వార్తా సంస్థ తెలిపింది.
రెండో వివాహం చేసుకునేందుకు మొదటి భార్యకు విడాకులిచ్చినట్లుగా దావూద్ అందరికీ చెబుతుంటాడని, అందులో వాస్తవం లేదని, అలాగే ఆయన ఉండే చిరునామా కూడా మారిందని తెలిపాడు. కరాచీలోనే మరో ప్రాంతానికి తన చిరునామాను మార్చాడని, కొన్నాళ్ల క్రితం దావూద్ మొదటి భార్యను దుబాయ్ లో చూసినట్లు పార్కర్ తెలిపాడు. ఆమె తరుచుగా తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడుతుంటుందని, మొదటి భార్య పేరు మైజాబిన్ అని, వారికి ముగ్గురు కుమార్తెలని చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ ముందు అలిషా చెప్పాడు.
దావుద్ నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా 'డి కంపెనీ'పై ఎన్ఐఏ గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, ఆయుధాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల మంజూరు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతోంది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తొయిబా, అల్ ఖైదా, జైషే మహ్మద్ వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు కీలక సహకారం అందిస్తోంది. ఐక్యరాజ్య సమితి దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఐక్యరాజ్య సమితి 2018లో విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరు కరాచీ చిరునామాతో ఉంది.