దేవయాని ఇష్యూలో ట్విస్ట్: టిక్కెట్లిచ్చింది అమెరికానే!
న్యూయార్క్: భారత దౌత్యాధికారిణి దేవయాని ఇష్యూలో ట్విస్ట్. దేవయాని వద్ద పని చేసిన సంగీత రిచర్డ్స్ భర్త పిలిప్ రిచర్డ్స్, వారి పిల్లలు జెన్నీఫర్, జతిన్లకు అమెరికా రాయబార కార్యాలయం అధికారిక ప్రయాణ సంస్థ టిక్కెట్లు జారీ చేసిందని, వాటిపై సేవారుసుం 4.5 శాతం మినహాయించినట్లుగా వెల్లడయినట్లు అధికారులు చెబుతున్నారు.
పరారీలో ఉన్న సంగీత కుటుంబ సభ్యులు ముగ్గురికి అమెరికా అధికారిక ట్రావెల్ ఎజన్సీ టిక్కెట్లను జారీ చేసినట్లుగా చెబుతున్నారు. సంగీత కుటుంబ సభ్యులు ఎయిర్ ఇండియా విమానంలో డిసెంబర్ 10వ తేదీన వచ్చారు. దేవయాని అరెస్టుకు రెండు రోజుల ముందే వారు వచ్చారు.
కాగా, దేవయానికి న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. దేవయానికి పూర్తిస్థాయి దౌత్యరక్షణ లభించేందుకు భారత ప్రభుత్వం.. ఐక్యరాజ్యసమితికి బదలీ చేసింది. అమెరికా దౌత్యకార్యాలయం నియమించుకున్న భారతీయుల వీసాల వివరాలు, వారికి చెల్లిస్తున్న వేతనాల వివరాలు, ఇతర సమాచారం సమర్పించాల్సిందిగా భారత్ విధించిన గడువు సోమవారంతో ముగిసిపోగా.. గడువు పొడిగించాల్సిందిగా అమెరికా దౌత్యకార్యాలయం కోరింది.