అది ముమ్మాటికీ ఉల్లంఘనే: డోక్లాం వివాదంపై జపాన్.. భారత్కు అండగా చైనాకు చురక!
ఇది ముమ్మాటికీ భూటాన్, భారత్ లతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: భూటాన్ ట్రై జంక్షన్ వద్ద చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణంపై జపాన్ స్పందించింది. ఇది ముమ్మాటికీ భూటాన్, భారత్ లతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. ఓపిక నశించిందంటూ యుద్దం దిశగా వ్యాఖ్యలు చేసిన చైనాకు చురకలు అంటించింది. యుద్దంతో ఏ సమస్య పరిష్కారం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలని తెలిపింది.
డోక్లామ్లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా
ఈ మేరకు జపాన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ తరుపు రాయబారి కెంజి హిరమట్సు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.
'డోక్లామ్ పరిస్థితులను జపాన్ నిశితంగా గమనిస్తోంది.భూటాన్ తో ఉన్న ఒప్పందం కారణంగానే భారత్ ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా చైనాతో దౌత్య సంబంధాలు దెబ్బ తినకుండా చర్చలు ముందుకు సాగేలా చూస్తామని తెలిపారు. శాంతియుతంగా ముందుకు సాగాలన్న భారత్ నిర్ణయాన్ని జపాన్ స్వాగతిస్తుంది' అని కెంజి పేర్కొన్నారు.
కాగా, నెలన్నర రోజులుగా డోక్లాం వివాదంలో భారత్-చైనా మధ్య పరస్పర వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కూడా వివాదాన్ని పెద్దది చేసిందనే చెప్పాలి. భారత పరిధిలోని అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కన్నేసినందునే.. ఆ దేశం భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని అక్కడి స్కాలర్ ఒకరు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
తాజాగా జపాన్ భారత్కు అండగా నిలబడటంతో చైనా కాస్త వెనక్కి తగ్గాల్సిన అనివార్యత ఏర్పడింది.మరి ఇప్పుడైనా చైనా తీరు మార్చుకుంటుందో లేదో చూడాలి.