Donald Trump: కెనడా, మెక్సికో, చైనా తర్వాత యూరప్ పై ట్రంప్ ప్రతీకారం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందు నుంచే హెచ్చరికలతో పొరుగుదేశాలపై కయ్యానికి కాలు దువ్విన డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అన్నంత పనిలాగే.. సుంకాల విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించిన తర్వాత.. తాజాగా యూరోపియన్ యూనియన్ పై సుంకాలు విధించడం గురించి మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ పై సుంకాలు విధించాలని ఆలోచిస్తున్నారా?.. అని వైట్ హౌస్ లోని ఓవల్ కార్యాలయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ మాట్లాడుతూ.."మీకు సరైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?.. యూరోపియన్ యూనియన్ మన పట్ల దారుణంగా ప్రవర్తించింది."అంటూ ట్రంప్ అన్నారు. ఆ సమాధానాన్ని బట్టి ఆలోచిస్తే ట్రంప్ యూరోపియన్ యూనియన్ పై ప్రతీకారానికి దిగుతారా అనే అంశంపై విశ్లేషకులు చర్చిస్తున్నారు.
2018లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకున్న అల్యూమినియం, స్టీల్ పై సుంకం విధించారనే విషయం తెలిసిందే. అనంతరం విస్కే, మోటార్ సైకిళ్లు సహా పలు అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ సుంకాలను విధించింది. దీనికి ట్రంప్ ప్రతీకార చర్యలు ఉంటాయా?.. అనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది. దీనికి ముందే ట్రంప్ చైనా, కెనడా, మెక్సికోతో సహా పొరుగు దేశాలపై సుంకాల కొరడా విధించారనే సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ నిర్ణయంపై కెనడా, మెక్సికోలు కూడా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో ఫిర్యాదు చేస్తామని చైనా పేర్కొంది.

అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా 155 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించింది. ఈ విషయాన్ని కెనడా తాత్కాలిక ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ట్రంప్ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే కెనడా ప్రధాని ట్రూడో ఒక ట్వీట్లో, తాను త్వరలో మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో మాట్లాడతానని, ఈ అంశంపై చర్చించడానికి ఇప్పటికే తన మంత్రివర్గాన్ని కలిశానని చెప్పారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు ప్రతిస్పందిస్తూ మెక్సికో కూడా సుంకాలు విధించింది. మెక్సికన్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన తర్వాత మెక్సికో ప్రయోజనాలను కాపాడటానికి సుంకాలు విధించాలని తన ఆర్థిక మంత్రిని ఆదేశించినట్లు మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తెలిపారు.
పనామా వివాదంలో చైనాకు ఎదురుదెబ్బ
పనామా కాలువపై చైనా ప్రభావం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పనామాను హెచ్చరించారు. ఆదివారం(ఫిబ్రవరి 2) పనామాకు చేరుకున్న రూబియో.. పనామా వెంటనే చర్య తీసుకోవాలని లేకుంటే అమెరికా తన హక్కులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు.ఆదివారం పనామా నగరంలో పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో జరిగిన సమావేశం తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ హెచ్చరికను చేశారు. ఇద్దరు నాయకుల మధ్య సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలని లేదంటే అమెరికా చర్యలు తీసుకుందని రూబియో హెచ్చరించారు. అనంతరం పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో మాట్లాడుతూ.. అమెరికా దురాక్రమణకు తాము భయపడబోమని వెల్లడించారు. చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications