వార్ రూమ్ లో వెళ్లిపోయిన ట్రంప్: పిన్ టు పిన్- ఊపిరి బిగబట్టి: వాట్ నెక్స్ట్?
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది.

ఈ వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైమానిక బలగాలు టేకాఫ్ తీసుకోవడం మొదలుకుని.. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించడం, ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై శక్తిమంతమైన బాంబులను జారవిడవడం, మళ్లీ స్వదేశానికి తిరుగుముఖం పట్టేంత వరకూ పిన్ టు పిన్ ఆయన పర్యవేక్షించారు.
ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కొ రూబియో, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జాన్ ర్యాట్ క్లిఫ్.. ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఉత్కంఠభరితంగా ఈ దాడులను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైట్ హౌస్ విడుదల చేసింది.
దీని తరువాత డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పై దాడులకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దీనికి గల కారణాలనూ తెలియజేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నంబర్ వన్ దేశం నుండి వచ్చే అణు ముప్పును ఆపడం కోసమే తాజా దాడులు చేయాల్సి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ దాడులు అద్భుతమైనవిగా అభివర్ణించారు. తమ వైమానిక బలగాలు సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల చేతికి ఇరాన్ నుంచి అణ్వస్త్రాలు అందుతున్నాయని పరోక్షంగా వివరించారు. ఇరాన్ లో శాంతి నెలకొనాలా? లేక విషాదమా? అనేది ఆ దేశం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. రాత్రి 10 గంటలకు ఆయన తెర మీదికి రానున్నారు. రాజధాని వాషింగ్టన్ లో గల తన అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి టీవీ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరాన్ లో చేపట్టిన సైనిక చర్య గురించి దేశ ప్రజలకు వివరించనున్నారు డొనాల్డ్ ట్రంప్.












Click it and Unblock the Notifications