డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రతీ రాజకీయ ప్రకటన ఒక కొత్త వ్యూహానికి సంకేతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన 19 నిమిషాల ప్రసంగం ఆ యుద్ధం ముగింపు దశకు వచ్చిందా లేదా మరింత ఉధృతమవుతుందా అనే ప్రశ్నను మరింత తీవ్రతరం చేసింది. తన ప్రసంగం ప్రారంభంలోనే ట్రంప్ విజయాన్ని ప్రకటించుకున్నారు.
గత నాలుగు వారాల్లో తమ సైన్యం యుద్ధభూమిలో వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, భారీ విజయాన్ని సాధించిందని చెప్పుకొన్నారు. అంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇటువంటి విజయాన్ని చూశారని పేర్కొన్నారు. ఇరాన్ సైనిక శక్తి దాదాపు అంతమైందని స్పష్టం చేశారు. ఇరాన్ నావికాదళం పూర్తిగా ధ్వంసమైందని, వైమానిక దళం పూర్తిగా నాశనమైందని తన ప్రసంగంలో ట్రంప్ వెల్లడించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండ్ అండ్ కంట్రోల్ నిరంతరం ధ్వంసానికి గురి అవుతుందోని అన్నారు.

క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే ఇరాన్ సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున నాశనం చేశామని ట్రంప్ పునరుద్ఘాటించారు. యుద్ధ చరిత్రలో ఇంత తక్కువ వారాల్లో ఏ శత్రువూ ఇంత వినాశకరమైన నష్టాన్ని అనుభవించలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంలో మరో కోణం కూడా బయటపడింది. ట్రంప్ ఒకవైపు విజయ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నప్పటికీ, మరోవైపు యుద్ధం ఇప్పుడే ముగియదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
వచ్చే రెండు, మూడు వారాల్లో వారికి అత్యంత తీవ్రమైన సమాధానం ఇస్తామని ట్రంప్ హెచ్చరించారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్ను చాలా గట్టిగా దెబ్బ కొడతామని, వారు ఎక్కడ ఉండాలో అక్కడికి పంపుతామని అన్నారు. ఆ రాతియుగానికి వారిని తిరిగి పంపిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే, ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలు లేకపోలేదని అన్నారు. అంటే- సైనిక ఒత్తిడి ఇంకా పెరగవచ్చని ట్రంప్ పరోక్షంగా తెలిపారు.
దౌత్యం గురించి ప్రస్తావిస్తూ, తెర వెనుక చర్చలు జరుగుతున్నాయని, మార్గాలు ఇంకా మూసుకుపోలేదని ఆయన వివరించారు. అమెరికా తన ఆపరేషన్ను అసంపూర్తిగా వదిలిపెట్టదల్చుకోలేదని ఇది స్పష్టం చేస్తోంది. హార్ముజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు హార్ముజ్ జలసంధితో అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలను ద్రోహులుగా అభివర్ణించారు.
ఈ సంఘర్షణ ముగియగానే, హార్ముజ్ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయని ట్రంప్ హామీ ఇచ్చారు. చాలా యుద్ధాలు దీర్ఘకాలం సాగుతాయని ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సంఘర్షణ త్వరగా ముగియదనే అంశాన్ని అమెరికా కూడా కొట్టిపారేయట్లేదనేది స్పష్టమౌతోంది. ఒకవైపు విజయం సాధించామని చెబుతూనే మరోవంక యుద్ధం కొనసాగవచ్చని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications