చైనాకు మరో బిగ్ షాకిచ్చిన ట్రంప్.. సుంకం భారీగా పెంపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో ఏమాత్రం తగ్గేలా లేరు. తాజాగా, చైనాపై ప్రతీకార సుంకాలను మరింత పెంచారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా ఉత్పత్తులపై సుంకాలను 145 శాతానికి పెంచినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వెల్లడించింది. చైనాపైనే అమెరికా అత్యధిక సుంకాలను విధించడం గమనార్హం.
చైనా దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడంతో ఆ రెండు దేశాలూ వాణిజ్య యుద్ధానికి తెరితీసినట్లయింది. అమెరికా చర్యలకు ధీటుగా స్పందిస్తున్న చైనా కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది.

చైనా చర్యపై తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. చైనాపై టారిఫ్ లను ఇటీవలే ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. తాజాగా, చైనాపై విధించిన సుంకాలు మొత్తంగా 145 శాతానికి చేరుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇక, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మినహాయింపు చైనాకు మాత్రం వర్తించదని అమెరికా స్పష్టం చేసింది. చైనాపై పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.
మరోవైపు, భారత్ సహా ఐరోపా దేశాలపైనా ట్రంప్ సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ 90 రోజులపాటు సుంకాల పెంపుపై వెనక్కి తగ్గడంతో ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మన దేశీయ మార్కెట్లు కూడా లాభాలు అందుకున్నాయి. ట్రంప్ సుంకాల పెంపును వాయిదా వేయడంతో ఐరోపా దేశాలు కూడా అమెరికాపై విధించిన సుంకాల పెంపును వాయిదా వేశాయి. 90 రోజులపాటు పెంచిన సుంకాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని పరిశీలించి ముందుకు వెళ్లనున్నాయి.












Click it and Unblock the Notifications