మిస్టరీ: అక్కడ బలహీనపడ్డ భూమి అయస్కాంత క్షేత్రం... ప్రమాదంలో ఉపగ్రహాలు ?
ప్రకృతిలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని విపత్తులు కూడా జరుగడం సర్వ సాధారణం. ఇక భూమిపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూమియొక్క అయస్కాంత క్షేత్రం బలహీనపడుతోందని ఇది ఉపగ్రహాలకు అంతరిక్ష నౌకలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దక్షిణ అమెరికాల మధ్య భూమి యొక్క అయస్కాంత క్షేత్రం బలహీనపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై పరిశోదన చేస్తున్న శాస్త్రవేత్తలు సౌత్ అట్లాంటిక్ అనోమలీ అని పిలువబడే ప్రాంతం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదని కూడా చెబుతున్నారు.

బలహీనపడుతోన్న భూమి అయస్కాంత క్షేత్రం
ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన కొన్ని ఉపగ్రహాల సమూహం నుంచి సేకరించిన డేటాద్వారా 1970 నుంచి 2020ల మద్య 8శాతం మేరా భూమి యొక్క అయస్కాంతం క్షేత్రం బలహీనపడిందని పరిశోధకులు కనుగొన్నారు. సౌత్ అట్లాంటిక్ ప్రాంతంలో గత పదేళ్లలో అయస్కాంత క్షేత్రం మరింతగా బలహీనపడినట్లు తమ పరిశోధనల ద్వారా బయటపడిందని చెప్పారు. కొన్ని ఉపగ్రహాల ద్వారా అదృష్టవశాత్తు భూమి యొక్క అయస్కాంతం క్షేత్రం బలహీనపడుతోందని తెలుసుకోగలుగుతున్నామని చెప్పిన పరిశోధకులు ఇక ఈ మార్పులతో భూమిలోపల ఎలాంటి చర్యలు చోటుచేసుకుంటాయో కనుగొనడం తమకు ముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు.

ఉత్తర దక్షిణ ధృవాలు తారుమారు
భూమియొక్క అయస్కాంత క్షేత్రం బలహీనపడుతోందనే సంకేతాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపిందని అంటే భూమియొక్క అయస్కాంత క్షేత్రం తారుమారు అయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవాలు తారుమారు అవుతాయని వివరించారు. ఇలా ఉత్తర ధృవం, దక్షిణ ధృవాల యొక్క అయస్కాంత క్షేత్రం 780,000 సంవత్సరాల క్రితం జరిగిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మరొకటి ఇలా జరగాలంటే ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు ప్రతి 250,000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. సౌరగాలులు, మరియు హానికరమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి భూగ్రహాన్ని రక్షించడంలో అయస్కాంత క్షేత్రం ముఖ్య భూమిక పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు పనిచేయవా..? ఇ
ఇదిలా ఉంటే టెలికమ్యూనికేషన్ మరియు ఉపగ్రహ వ్యవస్థలు కూడా పనిచేయాలంటే భూమి అయస్కాంత క్షేత్రం పైనే ఆధారపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇదే లేకపోతే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు పనిచేయడంలో సమస్యలు తలెత్తుతాయని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే సౌత్ అట్లాంటిక్ అనోమలీ ప్రాంతం ఈ సమస్యను ఎదుర్కొంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసే ఉపగ్రహాలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఇందుకు కారణం భూమియొక్క అయస్కాంత క్షేత్రం బలహీనపడుతుండటమే అని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు అంతరిక్ష నౌకలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని సాంకేతిక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏం చెబుతోంది..?
ఇదిలా ఉంటే ఈ సమస్య ఇప్పుడే ఉత్పన్నం కాదని చెబుతూనే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఉపగ్రహాలు ఇతర అంతరిక్ష నౌకలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటాయని పరిశోధకులు తమ స్టడీ ద్వారా చెబుతున్నారు. ఇక అయస్కాంతం క్షేత్రం బలహీనపడటంపై పరిశోధనలు చేస్తామని ఇందుకోసం తమ ఉపగ్రహాల సమూహం నుంచి సమాచారం సేకరిస్తామని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం బలహీనపడటం వెనక ఉన్న మిస్టరీపై కూడా స్పష్టత లేదని పరిశోధకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications