అటు వైపు ప్రయాణాలు వద్దు. గగనతలం బంద్, ఏ క్షణమైనా యుద్ధమే?
మిడిల్ ఈస్ట్ మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాల్లో మునుపెన్నడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మండుతున్న పశ్చిమాసియా సమీకరణాలు ఏ క్షణంలోనైనా అదుపు తప్పవచ్చని భావించిన అమెరికా, తమ పౌరులకు తీవ్రస్థాయి భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మిడిల్ ఈస్ట్ వైపు ప్రయాణాలు చేయవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని తేల్చిచెప్పింది. ఏ క్షణంలోనైనా విమాన రాకపోకలు స్తంభించిపోవచ్చని, గగనతలాలు మూతపడే ప్రమాదం ఉందంటూ వాషింగ్టన్ విడుదల చేసిన 'వరల్డ్ వైడ్ కాషన్' నోట్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
అగ్రరాజ్యం ఆందోళన.. గల్ఫ్ వ్యాప్తంగా హై అలర్ట్!
మిడిల్ ఈస్ట్లో సెక్యూరిటీ వాతావరణం అత్యంత క్లిష్టంగా మారిందని అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఆస్తులు, సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాలు, చివరికి వ్యాపార సంస్థలను సైతం ఇరాన్, దాని మద్దతుదారులైన సాయుధ బృందాలు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని హెచ్చరించింది. ఇరాక్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, లెబనాన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. పౌరులు స్థానిక సమాచారాన్ని నిమిష నిమిషానికి గమనిస్తూ, అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించింది.

రాజధాని రియాద్పై హౌతీల విరుచుకుపాటు
యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియా భూభాగమే లక్ష్యంగా శనివారం ఉదయం పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డాయి. రాజధాని రియాద్తో పాటు బిషా, తాయిఫ్, ఫరాసన్, యాన్బు వంటి కీలక నగరంపైకి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించాయి. అయితే సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమై, రియాద్ వైపు దూసుకొచ్చిన క్షిపణిని గాల్లోనే పేల్చివేశాయి. ఎయిర్పోర్టు సమీపంలో పెద్ద ఎత్తున నల్లటి పొగలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలోనే సౌదీ ప్రభుత్వం రాత్రంతా అత్యవసర విమాన అలర్ట్ను జారీ చేసింది.
సౌదీ, యెమెన్లకు డేంజర్ బెల్స్.. ట్రావెల్ వార్నింగ్
సౌదీ అరేబియాకు ప్రయాణాల విషయంలో అమెరికా 'లెవెల్-3' హెచ్చరికను కొనసాగిస్తోంది. గతంలో ఇరాన్ క్షిపణులు సౌదీలోని ఎయిర్పోర్టులు, చమురు ప్రాసెసింగ్ ప్లాంట్లు, దౌత్య కేంద్రాలపై పడిన దాఖలాలు ఉండటంతో, గాల్లో కూల్చివేసిన రాకెట్ల శకలాలు పడినా ప్రాణనష్టం తప్పదని హెచ్చరించింది. సౌదీలో పనిచేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు యెమెన్ సరిహద్దులకు 20 మైళ్ల పరిధిలోకి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. ఇక మరోవైపు పూర్తిస్థాయి అంతర్యుద్ధంతో నలిగిపోతున్న యెమెన్ను 'లెవెల్-4' (అస్సలు వెళ్లకూడదు) కేటగిరీలో ఉంచింది.
చమురు సంస్థలే లక్ష్యం.. రగులుతున్న యెమెన్ సరిహద్దులు
హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సరీ మాట్లాడుతూ.. రియాద్లోని సున్నితమైన ప్రాంతాలతో పాటు యాన్బులోని ప్రముఖ 'అరామ్కో' చమురు సంస్థ లక్ష్యంగా తాము క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించి దాడులు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం యెమెన్లోని మారిబ్, తైజ్, లాహ్జ్ ప్రాంతాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. పర్వత ప్రాంతాలు కావడం వల్ల హౌతీలను సైనిక చర్య ద్వారా పూర్తిగా తుడిచిపెట్టడం కష్టమని, వారిని నిరోధించడమే ప్రస్తుతానికి వ్యూహాత్మక మార్గమని రక్షణ రంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియాలో రేగిన ఈ చిచ్చు ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.













Click it and Unblock the Notifications
