యూరోపియన్ పార్లమెంటులో సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై చర్చ
లండన్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలపై బ్రస్సెల్స్లోని యూరోపియన్ పార్లమెంటులో బుధవారం చర్చ జరగనుంది. యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల ముందుకుక ఐదు విభిన్న తీర్మానాలు రానున్నాయని పీటీఐ తన కథనంలో వెల్లడించింది.
గత నెలలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్(యూఎన్హెచ్ఆర్సీ) భారతదేశం చేసిన చట్టం వివక్షను చూపేదిగా ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనా యూరోపియన్ పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది.
యూఎన్, ఈయూ మార్గదర్శకాలు, మానవ హక్కులను పరిగణలోకి తీసుకుని తీర్మానంపై చర్చించనున్నారు.

వివక్ష చూపే ఆ చట్టాన్ని విరమించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరనుంది. సీఏఏ చట్టం ద్వారా కొందరిని వివక్ష పూరితంగా వ్యతిరేకించడం సరికాదని, అది విభజనకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులను కూడా సీఏఏలో చేర్చాలని కోరింది.
ఇది ఇలావుంటే, భారతదేశం ఇప్పటికే యూరోపియన్ పార్లమెంటుకు ఖచ్చితమైన సమాధానమిచ్చింది. సీఏఏ తమ అంతర్గత విషయమని, దీనిపై జోక్యం సరికాదని స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో విదేశాలు కల్పించుకోవడం సరికాదని యూరోపియన్ పార్లమెంటుకు, విదేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓం బిర్లా తేల్చి చెప్పారు.
అయితే, యూరోపియన్ పార్లమెంటులో రోజువారీ వ్యవహారాల్లో భాగంగా డ్రాఫ్ట్ రిజల్యూషన్స్ ప్రవేశపెడుతుంటారని.. ఇది కేవలం ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్య అంశాలను తీసుకుని రూపొందించినవేనని ఈయూ అధికార ప్రతినిధి హెన్రిక్సన్ తెలపడం గమనార్హం. ఆయా తీర్మానాల్లో సభ్యులు అభిప్రాయాలు ఈయూ అధికార స్థానానికి మాత్రం ప్రాతినిథ్యం వహించవని తెలిపారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొని అక్కడ బతకలేని స్థితిలో మనదేశానికి శరణార్థులుగా వచ్చిన మైనార్టీల(హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్ట్రియన్లు, ఇతర మైనార్టీలు)కు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవరు వ్యతిరేకించినా దేశంలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications