ప్రతీ ఇంటికో డ్రోన్ వచ్చేస్తుంది: శాస్త్రవేత్త పరిమళ్
వాషింగ్టన్: రానున్న కాలంలో ప్రతి ఇంటికీ ఓ డ్రోన్ వచ్చేస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలోని భారత సంతతి శాస్త్రవేత్త పరిమళ్ కోప్డేకర్ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మౌంటెన్వ్యూలో 'అన్మేన్డ్ యేరియల్ సిస్టం' అనే అంశంపై జరిగిన ఓ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, రోబోలు అందిస్తున్న సేవల మాదిరిగానే రానున్న ఐదు నుంచి పదేళ్లలో మానవ రహిత విహంగ వాహనాలు (డ్రోన్) దైనందిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు.
'వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాలలోపు ప్రతి ఇంటికీ డ్రోన్ వచ్చేస్తుంది. దాన్ని నేను స్వయంగా చూస్తాను. ఇంటి పై కప్పులపై ఉండి అవే మన ఇంటికి భద్రతగా మారతాయి. సరుకుల చేరవేత దగ్గర నుంచి, నిత్యం చేయాల్సిన పలు పనులను అవే చక్కబెట్టేస్తాయి. ఫోన్కున్న క్రేజ్ తగ్గి అది డ్రోన్లవైపు మళ్లుతుంది' అని పరిమళ్ తెలిపారు.
కాలిఫోర్నియాలోని నాసా సేఫ్ అటానమస్ సిస్టమ్ ఆపరేషన్ ప్రాజెక్ట్లో పరిమళ్ మేనేజర్గా సేవలందిస్తున్నారు. సూది నుంచి స్క్రూడ్రైవర్ వరకు.. పాల నుంచి పప్పులు, ఉప్పు .. గృహావసరాలకు కావాల్సిన ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి, ఇంటి చుట్టూ పహారా కాయడానికి భవిష్యత్లో ప్రతి ఇంటిలోనూ ఓ డ్రోన్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
డ్రోన్ పంపించి ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఆధునిక టెక్నాలజీ నిత్య జీవితంలో ఓ భాగమవుతుంది. భవిష్యత్లో మన జీవితమంతా మానవ రహిత వాయుసేవలతో ముడిపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఎయిర్ ట్రాఫిక్ను నియంత్రించే నాసా ప్రాజెక్ట్కు చెందిన డేవ్వోస్ తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతంతోపాటు, వ్యవసాయ రంగం, వ్యర్థ పదార్థాల నిర్వహణ తదితర అంశాల్లో డ్రోన్ల వ్యవస్థ కీలకంగా మారుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. తమ అవసరాల మేరకు గగన ట్రాఫిక్ను నియంత్రించే అంశంపై పలు కంపెనీలు ఇప్పటి నుంచే దృష్టి పెట్టాయని డేవ్జోన్ చెప్పారు.