అరుదైన గౌరవం: ఫెడరల్ జడ్జీగా భారతసంతతి వ్యక్తి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ జడ్జికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలిఫోర్నియా రాష్ట్రంలో నియమించిన 11 మంది ఫెడరల్ జడ్జిల బృందంలో మన దేశానికి చెందిన విన్స్ గిరిధారి ఛాబ్రియా కూడా ఉన్నారు.
ఛాబ్రియా మొట్టమొదటి ఇండో-అమెరికన్ ఫెడరల్ జడ్జి. గతంలో అమెరికాలోని వివిధ కోర్టుల్లో పనిచేసిన ఆయన కార్మిక చట్టాలు, రవాణా కంపెనీల వ్యవహారాల్లో గణనీయమైన నిర్ణయాలు తీసుకున్నారు.
మెరైన్ల కేసు విచారణ నిలిపేయండి: నివేదిక ఇవ్వాలని భారత్, ఇటలీలకు ఐరాస
ఇటలీ నావికుల(మెరైన్ల) వ్యవహారం భారత్-ఇటలీ మధ్య సమస్యను మరింత జఠిలం చేసే అవకాశం ఉందని, కనుక వారిపై అన్ని కేసుల విచారణను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్ (ఐటిఎల్ఓఎస్) సోమవారం ఇరు దేశాలకు సూచించింది.
అంతేకాకుండా ఈ ఘటనపై భారత్, ఇటలీ సెప్టెంబర్ 24వ తేదీలోగా తమకు నివేదిక సమర్పించాలని ఐటిఎల్ఓఎస్ కోరినట్లు పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది. 2012లో కేరళ తీరంలో జరిగిన భారత జాలర్ల హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఇటలీ నావికులను తమకు అప్పగించి స్వదేశంలో వారిపై విచారణ జరిపేందుకు వీలుకల్పించాలని కోరుతూ ఇటలీ దాఖలు చేసిన పిటిషన్పై ఐటిఎల్ఓఎస్ ఈ తీర్పును వెలువరించింది.
ఇటలీ సహకరిస్తే ఆ దేశ నావికులపై నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. అయితే ఈ కేసు విచారణలో భారత్ తీవ్రమైన జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇటలీ ఐటిఎల్ఓఎస్ను ఆశ్రయించింది.
ఇదిలా ఉంటే..., నిందితుల్లో ఒకరైన సల్వటోర్ గిరోన్కు ఇటలీ వెళ్లేందుకు అంతర్జాతీయ ట్రైబ్యునల్ సోమవారం అనుమతినివ్వలేదని భారత హోంశాఖ ఢిల్లీలో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన భారత కస్టడీలోనే ఉన్నారు.