జపాన్లో భూకంపం: ఐదుగురికి తీవ్రగాయాలు
టోక్యో: జపాన్లో సోమవారం తెల్లవారుజామున 1.33 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్ దేశంలోని ఓడా పట్టణంలో ఈ భూకంపం సంభవించింది. ఐదుగురు ఈ ఘటనలో గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఓడా పట్టణంలో భూకంపం ధాటికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
భూకంపం కారణంగా పట్టణంలో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాకు విఘాతం కలిగింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలకూలాయి. కొన్ని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
రోడ్లు కూడ పగుళ్లతో కన్పించాయి. అయితే జపాన్లోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.అణు విద్యుత్ కేంద్రాలు యధావిధిగా పనిచేస్తున్నాయని అధికారులు ప్రకటించారు. అయితే ఎలాంటి సునామీ ప్రమాదాలు లేవని అధికారులు ప్రకటించారు.