కుప్పకూలిన చర్చి: ఐదుగురు దుర్మరణం
నైజీరియా: ప్రార్థనలు చేస్తున్న సమయంలో చర్చి కుప్పకూలిపోవడంతో ఐదుగురు క్రైస్తవులు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆగ్నేయ నైజీరియాలో ఈ సంఘటన జరిగింది.
ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎనుగు రాష్ట్రంలోని ఓడుమా పట్టణంలో సెయింట్ ఆంథోణి చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు. అర్దగంట తరువాత చర్చి ఒక్క సారిగా కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఇసాక్ ఎంబా అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

చర్చి కూలిపోయే సమయంలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారని ఇసాక్ ఎంబా పోలీసులకు చెప్పాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల నుండి మృతదేహాలు బయటకు తియ్యడానికి నానా ఇబ్బంది పడ్డారు.
గత వారం రోజుల నుండి ఎనుగు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగానే చర్చి కూలిపోయిందని పోలీసు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసింది. అయితే వర్షాల కారణంగా చర్చి కూలిపోయిందా, మరేమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసు అధికారలు ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications