ఆ దిగ్గజ ఆటో కంపెనీలోనూ.. 10 శాతం ఉద్యోగాలు కట్, నెలసరి ఉద్యోగులే టార్గెట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
మిచిగాన్: ఉద్యోగాల కోత అనేది కేవలం సాఫ్ట్ వేర్, టెక్ దిగ్గజ కంపెనీల్లో మాత్రమే కాదు.. ఇప్పుడిది ఆటో కంపెనీలకు కూడా పాకినట్టుంది. తాజాగా ఫోర్డ్ మోటార్ కంపెనీ కూడా తన ఉద్యోగులకు కోత పెట్టాలని ప్లాన్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ ఫీల్డ్స్, స్టాక్ ధర వెనుకబాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఆ కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఫోర్డ్ కంపెనీలో రెండు లక్షల మందికి పైగానే ఉద్యోగులుండగా.. వారిలో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఒక్క ఉత్తర అమెరికాలోనే ఉన్నారు.
ఈ వారంలోనే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాల కోత ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా టార్గెట్ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే గంటల లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదని ఈ జర్నల్ వెల్లడించింది.
అలాన్ ములల్లిని రీప్లేస్ చేస్తూ ఫోర్డ్ సీఈవోగా మార్క్ ను నియమించిన దగ్గర్నుంచి కంపెనీ షేర్లు 36 శాతం పడిపోయాయి. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై కంపెనీ బోర్డు సభ్యులు కూడా తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది.
అసలే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం ఫోర్డ్ మోటార్ కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, ప్రత్యర్థి కంపెనీ జనరల్ మోటార్స్ మాత్రం లాభాలను నమోదు చేసింది. ఈ ప్రభావం ఉద్యోగులపై వేటుకు దారితీస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications