మతిమరుపు: 91 శాతం మంది అభిప్రాయం ఇదే, ఇలా మొదలవుతుంది..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్, జ్ఞాపకశక్తి మందగించడం క్రమంగా పెరుగుతోంది. చాలామందికి దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం గమనించదగ్గ విషయం. ఇలాంటి మతిమరుపును యువత రుగ్మతగా భావించడం లేదని ఢిల్లీలోని ఎఫ్హెచ్వికె ఆసుపత్రి నిర్వహించిన సర్వేలో తేలింది.
అల్జీమర్స్ వల్ల ఎంతో నష్టం
దేశంలో ఈ సమస్య నానాటికీ పెరుగుతోందని ఈ సర్వేలో తేలింది. ప్రపంచ అల్జీమర్స్ నివేదిక-2015, ద గ్లోబల్ ఇంపాక్ట్ ప్రకారం మతిమరుపుతో బాధపడుతున్నవారు 4.6 కోట్ల మంది ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. మతిమరుపు వల్ల మూడేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా వాటిల్లే నష్టం విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుతుంది.
మూడో స్థానంలో భారత్
ఈ ఇబ్బంది ఎక్కువగా ఉన్న పది దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మన దేశంలో 41 లక్షల మంది ఈ రుగ్మతను ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి మతిమరుపు వ్యాధిగ్రస్థుల్లో 68 శాతం మంది తక్కువ, మధ్యాదాయ వర్గాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో 15-40 ఏళ్ల మధ్య వయసున్న 2వేల మందిని ప్రశ్నించింది.
91 శాతం మంది యువత వ్యాధిగా గుర్తించట్లేదు
మతిమరుపును ఒక వ్యాధిగా 91 శాతం మంది యువత పరిగణించడం లేదని సర్వేలో తేలింది. మానసిక రుగ్మత అయిన అల్జీమర్స్ గురించి 85 శాతం మందికి అవగాహన లేదు.
మధుమేహం వల్ల మతిమరుపు ముప్పు పెరుగుతుందని తెలుసా? అన్న ప్రశ్నకు 82 శాతం మంది తెలియదని సమాధానమిచ్చారు. అలాగే మద్యపానం కూడా ఈ రుగ్మతకు దారి తీయవచ్చన్న విషయమూ తమకు అవగాహన లేదని 72 శాతం మంది చెప్పారు. 97 శాతం మంది అసలు తమకు మతిమరుపు కారణాలు తెలియదన్నారు.
చిన్నగా మొదలై..
చిన్నపాటి మతిమరుపుతో ఇది మొదలవుతుంది. క్రమంగా సన్నిహితులనూ గుర్తించలేని స్థితికి జారిపోతారు. లక్షణాలు చాలా నెమ్మదిగా బయటపడతాయి.
చాలామందిలో ఇటీవలి ఘటనలను మరచిపోవడం, అదేరోజు వారు తిన్న ఆహారం, వెళ్లిన ప్రదేశం వంటి వాటిని చెప్పలేకపోవడం వంటి వాటి ద్వారా ఈ లక్షణాలు బయటపడుతుంటాయి. దారి మరిచిపోవడం, ఇంట్లో కూడా ఏదో చేయబోయి, మరొకటి చేయడం చేస్తుంటారు.