మరిన్ని దాడులు తప్పవు: ఫ్రాన్స్కు ఆల్ఖైదా తాజా హెచ్చరిక
ప్యారిస్: ఇటీవల ప్యారిస్లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి కోలుకోకముందే ఫ్రాన్స్కు మరో తాజా హెచ్చరికను పంపింది ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదా. మంగళవారం ఆల్ఖైదా ఇస్లామిక్ మెగ్రబ్(ఏక్యూఐఎం) నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి.
ఉత్తర ఆఫ్రికాలోని ఆల్ఖైదా శాఖ(ఏక్యూఐఎం) సైట్ మానిటరింగ్ గ్రూప్ ట్విట్టర్లో పంపిన సందేశం ప్రకారం.. ‘చార్లీ హెబ్డో మేగజైన్ కార్యాలయంపై దాడి జరిపి, 12 మందిని చంపిన కౌచి సోదరులను ముస్లింలు ఆదర్శంగా తీసుకోవాలి' అని పేర్కొంది. గత బుధవారం ఉగ్రవాదులు జరిపిన దాడి కార్యాలయంలోని 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ముస్లింలపై దాడులు చేస్తున్న ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉగ్రదాడులు తప్పవని ఆల్ఖైదా హెచ్చరించింది. ఇరాక్, సిరియా వంటి దేశాల్లోలాగే ఫ్రాన్స్లో కూడా బాంబు దాడులు జరుగుతాయని ఆల్ఖైదా ఆఫ్రికా శాఖ హెచ్చరించింది. ప్రవక్తకు వ్యతిరేకంగా కార్టూన్లు ప్రచురితం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది.

ముస్లిం దేశాల్లో హింసకు ఫలితంగా ఫ్రాన్స్ తగిన మూల్యం చెల్లించుకుందని ఏక్యూఐఎం తెలిపింది. సెంట్రల్ ఆఫ్రికా, మాలి లాంటి దేశాలను ఫ్రాన్స్ దళాలు ఆక్రమించుకున్నాయని, అయితే తమ ఆత్మాహుతి దళాలు బాంబులతో సిరియా, ఇరాక్ దేశాల్లో సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ప్రవక్తపై అనుచితమైన కార్టూన్లు, వ్యాఖ్యలు చేస్తే ఫ్రాన్స్ దేశంలో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించింది.
కాగా, గత బుధవారం జరిపిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం 17మంది మృతి చెందారు. దీంతో ఫ్రాన్స్ వ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సున్నితమైన ప్రాంతాల్లో 10వేలకు పైగా దళాలు సంచరిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో రక్షణా దళాలు పటిష్ట నిఘా వ్యవస్థను కొనసాగిస్తున్నాయని ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి జీన్ వెస్ లీడ్రెయిన్ తెలిపారు.












Click it and Unblock the Notifications