భారీ షాక్: భారత ప్రభుత్వ ఆస్తులు సీజ్ -కెయిర్న్ ఎనర్జీ వివాదంలో ఫ్రాన్స్ కోర్టు సంచలన ఆదేశం
భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించి దసో ఏవియేషన్ తో కుదిరిన ఒప్పందాలలో భారీ అవినీతి జరిగిందనే అంశంపై అక్కడి కోర్టుల్లో విచారణ జరుగుతోన్న సమయంలోనే మన దేశానికి మరో భారీ షాక్ తగిలింది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత కెయిర్న్ ఎనర్జీ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలలో అవకతవకలు రూఢీ కావడంతో ఏకంగా ఆస్తుల జప్తునకు ఆదేశాలు వెలువడ్డాయి. వివరాలివి..
కెయిర్న్ ఎనర్జీ, భారత ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న రెట్రోస్పెక్టివ్(పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో ఫ్రెంచ్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బు చెల్లించనందుకు గానూ.. ఫ్రాన్స్లోని భారత ప్రభుత్వ ఆస్తుల జప్తుకు అవసరమైన న్యాయప్రక్రియ ముందుకు కదిలింది. ఫ్రెంచ్ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కెయిర్న్ కంపెనీ వర్గాలు కూడా వెల్లడించాయి. సదరు ఆస్తుల విలువ 20 మిలియన్ యూరోలకు పైమాటే. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం మాత్రం ఆస్తుల సీజ్ కు సంబంధించి ఫ్రెంచ్ కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని వాదిస్తున్నది. ఈ వివాదం మూలాల్లోకి వెళితే..
2006లో కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ భారత కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్ ఎనర్జీ భారత్లోని తన అనుబంధ సంస్థ 'కెయిర్న్ ఇండియా'ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు. దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్ రీఫండ్ను నిలిపివేసింది. ఆ తర్వాత..
Recommended Video
తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్-భారత్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఆర్బిట్రేషన్(అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్ ఎనర్జీకి 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఆర్బిట్రేషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ భారత్ కూడా పిటిషన్ దాఖలు చేసింది.