ఐసిస్ స్థావరాలపై బాంబులతో ఫ్రాన్స్ భీకర దాడులు
పారిస్: పారిస్ నగరంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ ఐసిస్ స్థావరాల పైన భీకర దాడులు చేస్తోంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ రాజధాని రక్కా (సిరియా) పైన ఫ్రాన్స్ విరుచుకుపడింది. ఆయుధ భాండాగారాలు, శిక్షణ శిబిరాల పైన బాంబుల వర్షం కురిపిస్తోంది.
దాడులను ఫ్రాన్స్ రక్షణ శాఖ సైతం ధృవీకరించింది. పది యుద్ధ విమానాల సాయంతో శక్తివంతమైన 20 బంబాలును జారవిడిచినట్లు తెలిపింది. యూఏఈ, జోర్డాన్ల నుంచి ఒకేసారి ఈ విమానాలు బయలుదేరినట్లు పేర్కొంది. రక్కాలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇవి విధ్వంసం సృష్టించాయి.
దీంతో ఈ నగరంపై ఐసిస్ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. రక్కాపై రాత్రంతా బాంబుల వర్షం కురిసినట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. కనీసం 36 చోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలిపాయి. వీటిలో ఎంతమంది మృతి చెందారో తెలియాల్సి ఉంది.
మరోవైపు, సిరియా, ఇరాక్లలోని ఐసిస్ ఆధీనంలోని ప్రాంతాలపై అమెరికా సంకీర్ణ సేనలు సైతం విరుచుకుపడ్డాయి. తూర్పు సిరియాలోని ఆల్బూ కమాల్ ప్రాంతంలోని 116 ఐసిస్ చమురు ట్రక్కులను ధ్వంసం చేసినట్లు పెంటాగాన్ వెల్లడించింది.
అంతేకాకుండా ఫ్రాన్స్ పోలీసులు ఆదివారం రాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పారిస్ దాడులతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న 23 మందిని అరెస్టు చేయడంతో పాటు మరో వంద మందికి పైగా వ్యక్తులను గృహనిర్బంధంలో ఉంచారు.
ఈ దాడుల సందర్భంగా ఒక రాకెట్ లాంఛర్, మరో కలష్నికోవ్ తుపాకీ సహా 31 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రి బెర్నార్డ్ కాజెనువే వెల్లడించారు. దేశంలో మరిన్ని తీవ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందని ప్రధాన మంత్రి మాన్యుయెల్ వాల్ హెచ్చరిచడంతో సోదాలు చేస్తున్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిందేనని జి-20పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సు పిలుపునిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో పారిస్ మారణకాండను ఖండించాయి.
ఐసిస్ను ఆమూలాగ్రం పెకిలించి వేయాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని, రెట్టించిన పట్టుదలతో, నిబద్ధతతో ఉమ్మడిగా ఉద్యమించాలని కోరాయి. పారిస్ మృతులకు సంతాపంగా నిముషం పాటు జి-20దేశాల సదస్సు వౌనం పాటించింది.
ప్రపంచ దేశాలను కదిలించిన పారిస్ మారణకాండ నేపథ్యంలో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు ఉగ్రవాద మహమ్మారిని అంతం చేయడానికి కంకణం కట్టుకోవాలని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. మానవాళికే కాకుండా మానవత్వానికే విఘాతకరంగా మారిన ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదన్నారు.
సమిష్టి, సమీకృత చర్యల ద్వారానే ఈ జాడ్యాన్ని తుదముట్టించడం సాధ్యమవుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశమే జి-20శిఖరాగ్ర సదస్సు ప్రధాన అజెండా కావాలని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని అణచివేయడం కాదని, పూర్తిగా ఓడించి తీరాల్సిందేనని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడటానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు.