పెళ్లి, 12 ఏళ్ల కొడుకు!: ఖండించిన 'పాక్'లోని గీత
కరాచీ: పదమూడేళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ వెళ్లి.. అక్కడి ఈది ఫౌండేషన్లో ఉంటున్న గీతను భారత్ రప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, గీత మైనర్గా ఉన్నప్పుడే పెళ్లి జరిగిందని ఊహాగానాలు వినిపించాయి.
ఆమె కోసం బీహార్లోని సహర్బా గ్రామంలో గీత భర్త ఉమేష్ మహ్తో, వారి పన్నెండేళ్ల కుమారుడు నిరీక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని గీతకు చెప్పగా ఆమె ఖండించింది. ఈ విషయాన్ని ఈది ఫౌండేషన్ తెలిపింది.
మైనర్గా ఉన్నప్పుడు గీత ఆమె భర్త, కుమారుడిగా పేర్కొంటున్న ఓ ఫోటోను కూడా ఆమెకు పంపించామని, ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని గీత పేర్కొందని సదరు ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఇండియన్ హై కమిషన్ పంపించిన ఫోటో గ్రాఫ్ ద్వారా గీత తన కుటుంబ సభ్యులను గుర్తించిందని ఈది ఫౌండేషన్ తెలిపింది. అయితే, తాను పెళ్లయినట్లుగా వచ్చిన వార్తలను మాత్రం కొట్టిపారేసిందని చెప్పింది. అయితే, గీత తమ నుంచి ఏమైనా దాస్తుందా అనే విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ నుంచి తాను భారత్లో అడుగుపెడితే తల్లిదండ్రుల కంటే ముందే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను కలుస్తానని గీత చెప్పింది. ఈ నెల 26వ తేదీన భారత్లో గీత అడుగు పెట్టే అవకాశాలున్నాయి. తాను సల్మాన్ ఖాన్ను తొలుత కలవాలనుకుంటున్నట్లు గీత ఈది ఫౌండేషన్తో చెప్పింది.