గిల్గిత్ బాల్టిస్థాన్ భారత్ అంతర్భాగమే: బ్రిటన్ పార్లమెంట్ చారిత్రక తీర్మానం
గిల్గిత్ బాల్టిస్థాన్ భారత్ అంతర్భాగమని, 1947 నుంచి పాకిస్థాన్ అక్రమంగా దానిని ఆక్రమించుకుందని బ్రిటన్ పార్లమెంట్ అభిప్రాయపడింది.
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఓ చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ భారత్ అంతర్భాగమని, అయితే 1947 నుంచి పాకిస్థాన్ అక్రమంగా దానిని ఆక్రమించుకుందని ఆ దేశ పార్లమెంట్ అభిప్రాయపడింది.
ఈ ప్రాంతాన్ని పాక్ తమ ఐదో ప్రావిన్స్ గా చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ తీర్మానాన్ని కన్జర్వేటివ్ పార్టీ నేత బాబ్ బ్లాక్ మాన్ మార్చి 23న సభలో ప్రవేశపెట్టారు. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పాక్ తమ భూభాగంగా ప్రకటించుకోవడం సరికాదని ఈ తీర్మానం స్పష్టం చేసింది.
గిల్గిత్-బాల్టిస్థాన్ చట్టబద్ధంగా, రాజ్యంగ బద్ధంగా భారత్ లోని జమ్మూకశ్మీర్ లోని భూభాగమే. 1947లో పాకిస్తాన్ దీనికి అక్రమంగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని ప్రజలకు కనీసం ప్రాథమిక హక్కులను కూడా ఇవ్వలేదని, వాక్ స్వాతంత్య్రాన్ని కూడా హరించారని బ్రిటన్ తీర్మానం అభిప్రాయపడింది.
ఇక్కడ జనాభాను మర్చే ప్రయత్నం చేయడం, వివాదాస్పద చైనా, పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణాన్ని చేపట్టడం రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉందని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
మరోవైపు సీపీఈసీపై వెనక్కి తగ్గేది లేదని.. పాక్, చైనా దేశాల ప్రజల ప్రయోజనాల కోసం పాక్ తో కలిసి తాము పనిచేస్తామని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఈ ఎకనమిక్ కారిడార్ వివాదాస్పద పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తున్నా.. చైనా ఏమాత్రం లెక్క చేయడం లేదు.