ముదురుతున్న ట్రేడ్ వార్: చైనాకు భారీ షాక్ ఇవ్వనున్న అమెరికా
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతున్న దాదాపు 1300 ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచాలని అమెరికా ప్రతిపాదనలు చేసింది.
ఇటీవల అమెరికా స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంచడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. అమెరికా చర్యకు చైనా కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. అమెరికాకు చెందిన 128 ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచింది.
దీంతో ఇప్పుడు అమెరికా మరోసారి చైనా ఉత్పత్తులపై నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువ చేసే 1300 ఉత్పత్తులపై 25 శాతం సుంకం పెంచాలని భావిస్తోంది.
చైనా బిజినెస్ ప్రణాళికలకు లాభం చేకూర్చుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న ఉత్పత్తులపై సుంకం పెంచనున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ తెలిపింది.
ఏరోస్పేస్, ఐటీ, రోబోటిక్స్, మిషినరీ సహా పలు విభాగాలకు చెందిన వస్తువులపై సుంకం పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక జాబితాను విడుదల చేయనున్నారు.
దిగుమతి సుంకాలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం భారత్, చైనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై ఆ రెండు దేశాల్లో ఎక్కువ దిగుమతి సుంకం ఉందని, మన వద్ద మాత్రం ఆ దేశాల వస్తువులపై తక్కువ సుంకం ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాల్లో ఒకే రకమైన పన్ను విధానం ఉండాలని చెబుతున్నారు.