ఐటీ ఫ్రెషర్స్కు షాకిచ్చిన గూగుల్: సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ప్రఖ్యాత సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్.. ఫ్రెషర్స్కు షాక్ ఇచ్చింది. సంస్థలో ఇకపై కొత్త ఉద్యోగాలు ఉండబోవని ప్రకటించింది. ఈ ఏడాదిలో మిగిలిన ఆరు నెలలతో పాటు వచ్చే సంవత్సరంలో తమ సంస్థలోకి కొత్త ఉద్యోగులను తీసుకోదలచుకోలేదని పేర్కొంది. కొత్త ఉద్యోగాలేవైనా తీసుకోవాల్సి ఉంటే.. ఐటీకి బదులుగా ఇంజినీరింగ్, టెక్నికల్ ఇతర స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.
ఆ సంస్థల బాటలో..
ఈ మేరకు ఆయన సంస్థలో ప్రస్తుతం పని చేస్తోన్న ఉద్యోగులకు ఓ మెమొరాండం పంపించారు. టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, వాట్సప్ మాతృసంస్థ మెటా కూడా ఇదివరకే ఇదే తరహా ప్రకటన వెలువడించిన విషయం తెలిసిందే. సంస్థలో ఉద్యోగాల నియామకాలను నియంత్రిస్తామంటూ మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో గూగుల్ కూడా నడిచింది.
ఆదాయం తగ్గిందా..?
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితులే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రధాన వనరుల ద్వారా అందుతోన్న ఆదాయ వనరులు మందగించిందని, ఇదివరకట్లా క్యాష్ ఇన్ఫ్లోస్ ఉండట్లేదనే వాదనలు ఉన్నాయి. ఫలితంగా ఖర్చును కుదించుకోవడంపై గూగుల్ యాజమాన్యం దృష్టి సారించిందని, ఇందులో భాగంగా ఉద్యోగ నియామకాలను నియంత్రించేలా నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
ముందుచూపుతో నిర్ణయాలు..
సంస్థ ఆర్థికంగా మరింత ముందుకు వెళుతున్నప్పుడు, దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని సుందర్ పిచాయ్.. తన మెమొరాండంలో పేర్కొన్నారు. అలాంటి సమయంలో పారిశ్రామిక సామర్థ్నాన్ని మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ముందు చూపుతో కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దూరదృష్టి పని చేయాల్సి ఉంటుందని అన్నారు.
లక్షన్నరకు పైగా..
కొన్ని సందర్భాల్లో కంపెనీ శక్తిసామర్థ్యాలను ఏకీకృతం చేయడం, క్రమబద్ధీకరించడం అనివార్యమౌతుందని చెప్పారు. గూగుల్కు ఉన్న ప్రధాన ఆదాయ వనరుల్లో యూట్యూబ్ ఒకటి. అడ్వర్టయిజ్మెంట్ ద్వారా అందే ఆదాయం తగ్గిందనే అంచనాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఆల్ఫాబెట్ కంపెనీలో పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 1,64,000లుగా తేలింది. ఎక్కువగా గూగుల్ క్లౌడ్ డివిజన్, హార్డ్వేర్ సెగ్మెంట్లో ఉద్యోగులను కొత్తగా తీసుకుంది.
ఇంజినీరింగ్పై..
ఈ ఆర్థిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాల కోసం ఇప్పటికే జారీ చేసిన నియమాకాలు తప్పించితే.. కొత్తవారిని తీసుకోవట్లేదని సుందర్ పిచాయ్ తన మెమొలో తెలిపారు. ఇంజినీరింగ్, టెక్నికల్ ఇతర కేటగిరీల్లో కూడా పరిమితంగానే నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇదివరకు ఫేస్బుక్తో పాటు గూగుల్ ప్రధాన ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్, లిఫ్ట్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా కొత్త అపాయింట్మెంట్లను నియంత్రించిన విషయం తెలిసిందే. టెస్లా మరో అడుగు ముందుకేసింది. మూడు నెలల పాటు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం మేర కోత పెట్టనున్నట్లు పేర్కొంది.