కరోనా వ్యాక్సిన్ అసత్య ప్రచారాలకు గూగుల్ చెక్: 3 మిలియన్ డాలర్లతో స్పెషల్ ప్రొగ్రామ్
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ గురించిన తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు గూగుల్ ముందుకొచ్చింది. వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే అసత్య వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ న్యూస్ గ్లోబల్ ఓపెన్ ఫండ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందు కోసం 3 మిలియన్ డాలర్లను గూగుల్ ఖర్చు చేయనుంది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ కౌంటర్ మిస్ఇన్ఫర్మేషన్ ఓపెన్ ఫండ్ అనేది వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో వ్యాప్తి చెందే అసత్య సమాచారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని గూగుల్ ఓ బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. కరోనా యావత్ ప్రపంచంపై చాలా పెద్ద ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
అదే సమయంలో అసత్య వార్తలు, తప్పుడు సమాచారం కూడా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కొన్ని నివేదికల ద్వారా వెల్లడైంది. ఎప్పటికప్పుడు ఫాక్ట్ చెక్ చేయడం ద్వారా దీన్ని మనం నిరోధించవచ్చని గూగుల్ పేర్కొంది. ఈ అసత్య సమాచారాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఫాక్ట్ చెక్ వైపు నడిపించే ప్రయత్నాలు చేసే ప్రాజెక్టులను ఈ ఫండ్లో భాగస్వాములుగా చేర్చుకుంటామని వెల్లడించింది.
అన్ని రంగాల నుంచి దరఖాస్తులను 14 మందితో కూడిన బృందం పరిశీలిస్తుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావొచ్చని స్పష్టం చేసింది. గత డిసెంబర్ నెలలో కోవిడ్ 19పై అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు 1.5 మిలియన్ల డాలర్లతో ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని గూగుల్ పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మాని అడ్డుకునేందుకు పలు దేశాల ఫార్మా దిగ్గజాలు వ్యాక్సిన్ తయారు చేసి వినియోగంలోకి తీసుకొచ్చాయి. మనదేశంలో కోవిషీల్డ్, కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ పై సోసల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వ్యక్తు పెరిగిపోయాయి.