గాంధీజీ విగ్రహానికి అవమానం: జాత్యహంకారి, విగ్రహాలన్నీ పడగొట్టాలంటూ నినాదాలు
జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. మహాత్మా గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ జోహెన్స్ బర్గ్లోని ఆయన విగ్రహంపై ఓ కొంత మంది దుండగులు బకెట్లతో తెలుపు రంగు జల్లి, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. దక్షిణాఫ్రికాలో మహాత్మునికి గుర్తుగా ఆ నగరం నడిబొడ్డున 1997లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి ఆ ప్రాంతం గాంధీ స్వ్కేర్గా వాడుకలోకి వచ్చింది.
సెక్యూరిటీ గార్డు వెల్లడించిన కథనం ప్రకారం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ లోగో ధరించిన యువకుల కొంతమంది బకెట్లలో తీసుకొచ్చిన తెలుపు రంగును గాంధీ విగ్రహంపై జల్లారు. అంతటితో ఆగకుండా గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ దక్షిణాఫ్రికాలో ఆయన విగ్రహాలన్నింటిని పడగొట్టాలంటూ నినాదాలు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వ ఆస్తి విధ్వంసం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మహాత్మా గాంధీ తమకు ఆరాధ్యుడని, విగ్రహంపై జరిగిన దాడిలో తమ పార్టీ ప్రమేయం లేదని ఏఎన్సీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాల్లోకెల్లా జోహెన్సస్ బర్గ్ విగ్రహం ప్రత్యేకమైనది.
గాంధీని యుక్తవస్కుడిగా చూపే ఏకైక విగ్రహం ఇదొక్కటే. 1893లో గాంధీ దక్షిణాఫ్రికాకు వచ్చారు. 1903లో జోహెన్స్ బర్గ్కు వచ్చిన గాంధీ 1914 వరకు అక్కడే నివసించారు. చట్టపరమైన సంస్థను ప్రారంభించేందుకు గాంధీచి తన యుక్తవయసుని ఇక్కడే గడిపారు.