ఢాకా రెస్టారెంట్పై ఉగ్రదాడి: బందీలకు విముక్తి
ఢాకా: ఎట్టకేలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆపరేషన్ ముగిసింది. భద్రతాదళాలు హోలీ అరిస్టాన్ హోటల్నుంచి బందీలను విముక్తం చేశాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బంగ్లాదేశ్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. గుల్షన్ ప్రాంతంలోని హోలీ ఆరిస్టాన్ బేకరీలోకి శుక్రవారం 9 గంటల ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు చొరబడి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది.
సాయుధులు 8 మంది దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 60 మందిని వారు బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇటలీ, జపాన్ దేశస్థులు సహా కనీసం 20 మంది విదేశీయులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఈ రెస్టారెంట్ను చుట్టుముట్టారు.
ఉగ్రవాదులు మధ్యమధ్యలో కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా అదనపు పోలీసు కమిషనర్ సహా దాదాపు 30 మంది గాయపడ్డారు. ఇద్దరు దౌత్యవేత్తలు కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతాధికారులు చెబుతున్నారు.
రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి ఒకరు తప్పించుకొని బయటపడ్డాడు. రాత్రి 8.45 గంటల సమయంలో పలువురు సాయుధులు చొరబడి, ప్రధాన షెఫ్ను బందీగా తీసుకున్నట్లు అతడు చెప్పాడు. నాటు బాంబులు కూడా పేల్చారని, దీంతో అందరూ భయాందోళనల్లో మునిగిపోయారని తెలిపాడు.
గుల్షన్ ప్రాంతంలో పలు దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. హోలీ బేకరీకి విదేశీయుల్లో మంచి ఆదరణ ఉంది. వారు తరచూ అక్కడికి వెళుతుంటారు. తాజా దాడి తమ పనేనంటూ ఓ వైపు ఇస్లామిక్ స్టేట్, మరో వైపు అల్ఖైదా చెప్పుకుంటున్నాయి.
భారత హైకమిషన్ సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ దిల్లీలో తెలిపారు. ఢాకాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారవర్గాలు చెప్పాయి.