కరాచీ: బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు, 47మంది మృతి, మోడీ విచారం
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఇస్లామియా షియా కమ్యూనిటీకి చెందిన సభ్యులుగా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. కరాచీలోని సఫోరా చౌరంగి ప్రాంతంలో ఎనిమిది ద్విచక్రవాహనాలపై వచ్చిన ఉగ్రవాదులు బస్సులోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు.

ఆ బస్సులో మొత్తం 60మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల కణతలకు గురిపెట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో మొత్తం 47మంది మృతి చెందారు. మరణించిన వారిలో 25మంది పురుషులు, 16మంది ఉన్నారు. బస్సులోని మిగితా వారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ తాలిబన్ పేర్కొంది.
మోడీ విచారం
కరాచీలో ఉగ్రవాదులు బస్సుపై దాడి చేయడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఆపద సమయంలో పాకిస్థాన్కు అండగా ఉంటామని మోడీ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications