ప్రతీకారంతో మిషన్ గన్ తో కాల్పులు: ముగ్గురు పోలీసుల మృతి
కరాచీ: ప్రతీకారంతో అగంతకుడు పోలీసులు, పౌరుల వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఈ దాడులలో ముగ్గురు పోలీసులు మరణించి పలువురు గాయపడ్డారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని అధికారులు తెలిపారు.
బుధవారం పాకిస్థాన్ లోని కరాచీలోని బంగోరియా గొతి ప్రాంతంలో ఒక అగంతకుడు మిషన్ గన్ తీసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్న పోలీసులు, అటు వైపు వెళుతున్న వాహనాల మీద బుల్లెట్ లు దూసుకు వెళ్లాయి.
ఈ కాల్పులలో ఒక ఎస్ఐ, ఇద్దరు పోలీసులు సంఘటనా స్థలంలో మరణించారు. ఒక పోలీసుకు తీవ్రగాయాలైనాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. వాహనాలలో వెళుతున్న వారికి గాయాలైనాయి. కాల్పులు జరిపిన అగంతకుడు అక్కడి నుండి చాకచక్యంగా తప్పించుకున్నాడు.
గొతి ప్రాంతంలో తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మంగళవారం భద్రత దళాలు సోదాలు చేస్తు జరిపిన కాల్పులలో నలుగురు తాలిబన్లతో సహ 7 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారని అధికారులు చెప్పారు. అందుకు ప్రతీకారంగానే అగంతకుడు కాల్పులు జరిపి ఉంటాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.