భారతీయులకు విషెస్: ఆయన జీవితం అమెరికన్లకు ఆదర్శప్రాయం: జో బిడెన్, కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మరోసారి జాయింట్ స్టేట్మెంట్ జారీ చేశారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తోన్న సిక్కులకు శుభాకాంక్షలు తెలిపారు. మతానికి అతీతంగా ఆయన జీవితం అమెరికన్లకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 551వ జయంతిని పురస్కరించుకుని వారు ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ బోధనలను విశ్వ మానవాళికి సామాజిక బాధ్యతను, నైతికతను నేర్పాయని చెప్పారు.
Recommended Video
గురునానక్ దేవ్ జీ అలవరిచిన ఆధ్యాత్మిక జీవనం ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. మతాలకు అతీతంగా ఏకత్వాన్ని, సమానత్వాన్ని చాటి చెప్పాయని జో బిడెన్, కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అనేక సవాళ్లతో కూడిన ఈ సంవత్సరంలో అమెరికాలో నివసించే ప్రతి సిక్కు మతస్తుడూ ప్రదర్శించిన సంయమనం అతి గొప్పదని, దానికి కారణం గురునానక్ సూచించిన బాటలో వారు ప్రయాణించడమేనని అన్నారు. అలాంటి సంయమనం అందరికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
జాత్యహంకారానికి వ్యతిరేకంగా కొనసాగిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఒకవంక హింసాత్మకంగా రూపుదాల్చినప్పటికీ.. సిక్కులు మాత్రం గురునానక్ బోధనలను స్ఫూర్తిగా తీసుకుని శాంతియుతంగా ర్యాలీలను చేపట్టారని గుర్తు చేశారు. మతానికి అతీతంగా వ్యవహరించడం, అందరినీ సమాన దృష్టితో చూడటం గురునానక్ బోధనల నుంచే వారు అలవరుకున్నారని జో బిడెన్, కమలా హ్యారిస్ పేర్కొన్నారు.
అందరి ఆకలిని తీర్చడానికి గురునానక్ శతాబ్దాల కిందటే లంగర్ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దాన్ని ఇప్పటికీ కొనసాగించడం సిక్కుల గొప్పదనానికి నిదర్శనమని చెప్పారు. గురునానక్ చూపించిన ఐక్యత, సామరస్యం, సేవామార్గాలను అన్ని దేశాలను అనుసరించాల్సిన అవసరం ఉందని, కఠోర శ్రమ, నిజాయితీ, ఆత్మాభిమానంతో కూడిన జీవిన విధానాన్ని ఆయన ప్రబోధించారని పేర్కొన్నారు. గురునానక్ సమాజ సేవే పరమావధిగా ప్రజలను ముందుకు నడిపించారని అన్నారు.