'హిల్లరీ ఓటమి వెనుక.. అతడే ప్రధాన కారణం'
వాషింగ్టన్ : భారత్లో ఎన్నికల అంచనాలు తారుమారైనట్టే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఎంతటి అనూహ్య మలుపు తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. డెమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పీఠాన్ని ఎక్కడం ఇక లాంఛనమే అని అంతా భావిస్తున్న తరుణంలో.. అధ్యక్ష ఎన్నికలు ఆమెకు ఎప్పటికీ మరిచిపోలేని షాక్ ఇచ్చాయి.
అప్పటిదాకా సర్వేలన్ని హిల్లరీయే అధ్యక్షురాలు కాబోతున్నారని ఊదరగొట్టగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం తలకిందులు కావడం వెనుక ఈ-మెయిళ్ల వ్యవహారమే బలమైన ప్రభావం చూపించి ఉంటుందని తాజాగా హిల్లరీ వాపోయినట్టు తెలుస్తోంది. ఈ-మెయిళ్ల వ్యవహారాన్ని తిరగదోడిన ఎఫ్.బీ.ఐ డైరెక్టర్ జేమ్స్ కామీ వల్లే తనకు అధ్యక్ష పీఠం దూరమయ్యిందనేది హిల్లరీ వాదన.
ఈ-మెయిళ్ల వ్యవహారాన్ని తిరగదోడడంతో.. విజయావకాశాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయని హిల్లరీ ఆవేదన చెందినట్టు సమాచారం. డెమెక్రటిక్ పార్టీ నిధుల సేకర్తలు, విరాళకర్తలతో నిర్వహించిన ఓ భేటీలో హిల్లరీ వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ-మెయిళ్ల వ్యవహారంపై కాంగ్రెస్ కు కామీ రాసిన రెండు లేఖలు తన గెలుపును తీవ్రంగా ప్రభావితం చేశాయని.. అందువల్లే కీలకమైన రెండు రాష్ట్రాల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని హిల్లరీ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
సమావేశానికి హాజరైన ఓ విరాళకర్త.. భేటీ విషయాలను మీడియాతో వెల్లడించడంతో.. హిల్లరీ చేసిన ఈ వ్యాఖ్యలు బయటకొచ్చాయి. మొత్తంగా హిల్లరీ ఓటమికి ఈ-మెయిళ్ల వ్యవహారమే ప్రధాన కారణమన్న నిర్ణయానికి వచ్చారు హిల్లరీ.