హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు
కరాచీ: పాకిస్థాన్లో మరో హిందూ ఆలయం నేలమట్టమైంది. దక్షిణ సింధూ ప్రావిన్స్లో ఓ హిందూ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. థాట్ట జిల్లా ఘరో పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి ఘాతుకానికి తెగబడ్డారు దుండగులు. ఆలయంలోని ప్రధాన దేవతావిగ్రహాలను ధ్వంసం చేసి.. సమీపంలో ఉన్న చెత్తకుప్పలో పడేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దైవదూషణ, ఉగ్రవాదం అభియోగాల కింద కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.
నెలవారీ పూజాకార్యక్రమాల నిర్వహణ కోసం ఆలయంలో ఏర్పాటుచేస్తున్న సమయంలో శుక్రవారం అర్థరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని స్థానిక హిందూ కౌన్సిలర్ లాల్ మహేశ్వరి తెలిపారు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఐదుగంటల మధ్య వారు ఆలయంలోని విగ్రహాలను ఎత్తుకెళ్లి ధ్వంసం చేశారని, ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన హిందూ భక్తులు ఆలయంలో దేవతామూర్తులు లేకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ విధ్వంసానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికే పాకిస్థాన్లోని అనేక దేవాలయాలు దుండగులు, ఉగ్రమూకల దాడుల్లో ధ్వంసమయ్యాయి.