భారత్ తో అణుయుద్దం: పాక్ హిజ్బుల్ వార్నింగ్ !
కరాచీ: కాశ్మీర్ అంశంలో భారత్ ఇదే విధంగా ప్రవర్థిస్తే పాక్ కచ్చితంగా బుద్ది చెబుతుందని హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయిద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. భారత్ తో పాక్ అణు యుద్ధం చెయ్యడానికి వెనకడుగు వెయ్యదని అన్నాడు.
కరాచీలో సయిద్ సలాహుద్దీన్ మీడియాతో మాట్లాడాడు. కాశ్మీర్ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారని, వారికి నైతికంగా, రాజ్యాంగపరంగా, రాజకీయంగా మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ సిద్దంగా ఉందని, అందుకు తాము (హిజ్బుల్) కట్టుబడి ఉన్నామని చెప్పాడు.
కాశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాశ్మీర్ విషయంలో ఇప్పటికే భారత్- పాక్ దేశాల మధ్య మూడు సార్లు ముద్ధం జరిగిందని గుర్తు చేశాడు.
ఇలాగే ఉంటే ఇక ప్రపంచ యుద్ధం జరుగుతుందని జోస్యం చెప్పాడు. కాశ్మీర్ ప్రజల మనోభావాలను భారత్ గౌరవించాలని అన్నాడు. కాశ్మీర్ ప్రజలు తమకు స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు.
పాకిస్తాన్ మద్దతు ఇవ్వకపోయినా, ప్రపంచం పట్టించుకోకపోయినా, ఐక్యరాజ్య సమితి తమ భాద్యతలు నిర్వర్తించకపోయినా కాశ్మీర్ ప్రజలు పట్టించుకోరని, వారి చివరి రక్తపు బొట్టు దారపోసైనా పోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని చెప్పాడు.
కాశ్మీర్ ప్రజలను భారత్ ప్రభుత్వం అణచివేస్తున్నదని ఆరోపించాడు. కాశ్మీర్ విముక్తికి వాస్తవాధీన రేఖను అతిక్రమించే ప్రకటన చెయ్యడానికి హిజ్బుల్ వెనకడుగు వెయ్యదని సయిద్ సలాహుద్దీన్ ఘాటుగానే స్పందించాడు.