కజకిస్థాన్ మిలిటరీ బేస్లో వరుసగా భారీ పేలుళ్లు: 9 మంది మృతి, 90 మందికిపైగా గాయాలు
నూర్సుల్తాన్: కజకిస్థాన్లో భారీ పేలుళ్ల సంభవించాయి. దక్షిణ కజకిస్థాన్లోని సైనిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వచేసే గోదాం వద్ద చోటు చేసుకున్న వరుస పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 90 మందికిపైగా గాయాలపాలయ్యారు.
సుమారు పది పేలుళ్లు చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొంగలు వ్యాపించాయి. కిర్గిజిస్థాన్ సరిహద్దులోని తారాజ్ నగరం సమీపంలో మిలిటరీ బేస్ వద్ద ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
పేలుళ్ల ఘటనలతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలోని 1200 మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రహదారులను మూసివేశారు. అయితే, పేలుళ్లకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జంట పేలుళ్లు చోటు చేసుకున్న గంటల తర్వాత ఇక్కడ పేలుళ్లు సంభవించాయి.
కాబూల్ జంట పేలుళ్లలో 100 దాటిన మరణాలు
ఆప్ఘనిస్థాన్లో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 103కు చేరింది. ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. మరో 90 మంది ఆప్ఘాన్ ప్రజలు మృతి చెందారు. 150 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాబూల్ జంట పేలుళ్లకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్-ఖోరాసన్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు వెల్లడించారు. మరోవైపు, కాబూల్ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంన్జీ తెలిపారు. ఈసారి రాకెట్లు, వాహన బాంబులతో విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకోవచ్చని హెచ్చరించారు.
ఈ జంట పేలుళ్ల ఘటనలపై స్పందించారు ఆప్ఘాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్. తాలిబన్లు-హక్కానీ నెట్వర్క్లలో ఐసీస్-కే మూలాలున్నాయని తెలిపారు. కానీ, తాలిబన్లు దీన్ని తిరస్కరించడం ఎలా ఉందంటే.. ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్ సంస్థతో సంబంధాలు లేవని పాకిస్థాన్ చెప్పినట్లుందని అన్నారు. గురువు(పాక్) నుంచి తాలిబన్లు చాలా నేర్చుకున్నారని అమ్రుల్లా సలేహ్ వ్యాఖ్యానించారు.
Recommended Video
కాబూల్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారిని వెంటాడి హతమారుస్తామని అన్నారు. తమ సైనికుల మరణం వేదనకు గురిచేసిందన్నారు. తాలిబన్లకు కూడా ఇస్లామిక స్టేట్ దాడిపై ముందస్తుగా ఎలాంటి సమాచారం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని జో బైడెన్ వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ బాధ్యత వహించడంతో.. ఇక అమెరికా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చనే వార్తలను బలపరుస్తూ జో బైడెన్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. తాలిబన్లపై ప్రతీకారాన్ని తీర్చుకుంటామని, వారిని వెంటాడుతామని హెచ్చరించారు. దాడి కారకులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, పేలుళ్ల అనంతరం పలు దేశాలు తమ దేశ పౌరులు, ఆప్ఘాన్ ప్రజలను శుక్రవారం చేపట్టాయి. పలు దేశాలు తమ తరలింపులను శుక్రవారంతోనే ముగిస్తామని వెల్లడించాయి. ఇందుకు కారణంగా ఆగస్టు 31 వరకే తరలింపులను అనుమతిస్తామని, ఆ తర్వాత అనుమతించేది లేదని తాలిబన్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.