యుద్ధం వద్దు.. అలా ఉందాం: పుల్వామా దాడిని ఖండిస్తూ పాక్ మహిళల ప్లకార్డులు
ఇస్లామాబాద్: 'నేను పాకిస్తాన్ మహిళను. కానీ జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిని ఖండిస్తున్నాను' ఇది కొందరి పాకిస్తాన్ మహిళల నినాదం. పలువురు పాక్ మహిళలు ఈ ఉగ్రవాద దాడిని కండిస్తున్నామని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవి వైరల్గా మారాయి.
అదే సమయంలో యుద్ధం వద్దని కూడా ఇరు దేశాలకు సూచనలు చేస్తున్నారు. వీరు యాంటీ హేట్ ఛాలెంజ్ పేరుతో ఉద్యమం చేపట్టారు.
ఇన్నాళ్లు భారత్ వ్యతిరేకతనను నరనరాన జీర్ణించుకున్న పాకిస్తానీ అమ్మాయిలు కూడా.. పుల్వామా ఘటనను ఖండిస్తున్నామని, యుద్ధం వద్దని చెబుతున్నాయి.
సెహీర్ మీర్జా అనే యువతి ఇండిపెండెంట్ జర్నలిస్ట్. భారత్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకుంది. కానీ పుల్వామా ఘటనను ఆమె బాహాటంగా ఖండించింది. భారత్కు మద్దతుగా యాంటీ హేట్ చాలెంజ్ను చేపట్టింది.
దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేమని తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొంది. దాని కింద.. 'నేను పాకిస్తాన్ అమ్మాయిని... పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను' అనే ప్లకార్డు ప్రదర్శిస్తూ ఫోటో పెట్టింది. భారత్కు మద్దతుగా తాను చేపట్టిన ప్రచారంలో భాగస్థులు కావాలని ఆమె అందరినీ కోరింది. ఆమె స్ఫూర్తితో చాలామంది మహిళలు పుల్వామా దాడిని ఖండిస్తున్నారు. ఆమెకు మద్దతుగా పలువురు పాక్ పురుషులు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం వద్దని, శాంతిగా ఉందామని చెబుతున్నారు.
కాగా, సెహిర్ మీర్జా తన ఫేస్బుక్ వాల్ పైన.. బెర్లిన్ గోడ కూల్చినట్లుగా, భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.