మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్నా: భూకంప బాధితుడి ఆవేదన
ఖాట్మండు: నేపాల్ విలయం నుంచి బయటపడిన వ్యక్తుల దీనగాథలు చూస్తుంటే దిగ్భ్రాంతితో పాటు తీవ్రమైన ఆవేదన కలుగుతుంది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు కాపాడాయి.
మూడు రోజుల పాటు శిథిలాల కింద మగ్గి చివరికి ప్రాణాలతో బయటపడిన రిషి ఖనాల్ అనే బాధితుడు చెప్పిన విషయాలు గమనిస్తే హృదయం ద్రవించకమానదు. శిథిలాల కింద చిక్కుకున్న తాను ప్రాణాలు నిలుపుకునేందుకు మూత్రం సేవించానని అతను చెప్పాడు. శవాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికానని అన్నాడు.
మృతదేహాల నుంచి వస్తున్న దుర్వాసనను భరిస్తూ సహాయం ఎదురు చూసినట్లు తెలిపాడు. ఫ్రెంచ్ దేశానికి చెందిన సహాయక బృందం అతన్ని గుర్తించి కాపాడింది. శిథిలాల నుంచి బయటపడిన ఖనాల్ పెదవులు చిట్లిపోయి, గోళ్లు పాలిపోయి దీనంగా కనిపించాడు.
ఖాట్మండులో కూలిపోయిన ఓ హోటల్ భవనం శిథిలాల కింద అతను దాదాపు 82 గంటల పాటు ఉన్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.